కొండాపూర్, సెప్టెంబర్ 21 : వినాయక చవితి సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో తన ఫొటో లేదన్న కోపంతో ఓ నాయకుడు పెట్రోల్ పోసి నిప్పంటించాడు. అతడిని గుర్తించిన పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే, ఈ ఘటనకు సంబంధించిన వివరాలు తెలిసి కూడా పోలీసులకు సమాచారం ఇవ్వకుండా దాచి.. కేసును పక్కదోవ పట్టించేందుకు ప్రయత్నించిన బీజేపీ నాయకురాలిపై కూడా చందానగర్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఇద్దరిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. గురువారం చందానగర్ పోలీసు స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఇన్స్పెక్టర్ పాలవెల్లి వివరాలను వెల్లడించారు. పాపిరెడ్డి కాలనీకి చెందిన బీజేపీ సీనియర్ నాయకురాలు కాంచన కృష్ణ గత మంగళవారం వినాయక చవితి సందర్భంగా ఫ్లెక్సీలను ఏర్పాటు చేయించారు. ఫ్లెక్సీలలో అదే కాలనీకి చెందిన బీజేపీ కార్యకర్త సూర్ణ రాజు ఫొటో లేకపోవడంతో అతడు ఆగ్రహంతో ఆమెను నిలదీశాడు.
అనంతరం అక్కడి నుంచి వెళ్లిపోయిన రాజు.. ఆ తర్వాత పెట్రోల్ పోసి ఫ్లెక్సీని తగలబెట్టాడు. పెట్రోలింగ్ పోలీసులు ఫ్లెక్సీ తగలబెట్టిన విషయం తెలుసుకొని ఇన్స్పెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. ఇన్స్పెక్టర్ వెంటనే ఘటనను పరిశీలించి.. విచారణకు ఆదేశించారు. అయితే, ఫ్లెక్సీని ఎవరు తగలబెట్టారో తనకు తెలియదని, ఎవరో గిట్టనివారు తగలబెట్టి ఉంటారంటూ బీజేపీ నాయకురాలు కాంచన కృష్ణ పోలీసులకు తెలిపారు. అనుమానం వచ్చిన పోలీసులు.. మాదాపూర్ ఎస్ఓటీ పోలీసుల సహకారంతో సీసీ కెమెరాలను పరిశీలించగా.. బీజేపీ కార్యకర్త రాజు పోస్టర్ను తగలబెట్టినట్లు గుర్తించారు. ఈ మేరకు రాజును విచారించగా.. అసలు విషయం బయటపడింది. ఈ విషయం కాంచన కృష్ణకు కూడా తెలుసునని చెప్పాడు. తెలిసి కూడా సమాచారం ఇవ్వకుండా పోలీసుల దర్యాప్తును పక్కదోవ పట్టించేందుకు ప్రయత్నించిన కాంచన కృష్ణపై కూడా కేసు నమోదు చేశారు.