అబిడ్స్, సెప్టెంబర్ 3: నాంపల్లి కేర్ దవాఖాన వైద్యులు ఐదో దశ క్రానిక్ కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న ఓ యువకుడికి విజయవంతంగా మూత్రపిండాన్ని మార్పిడి చేశారు. నాలుగేండ్లుగా హీమో డయాలసిస్పై ఉన్న ఆ బాధితుడు.. ఇటీవల వైద్యశాలలో చేరాడు. నెఫ్రాలజిస్ట్ కన్సల్టెంట్ డాక్టర్ ఫైస్తా హుస్సేని, డాక్టర్ అబ్దుల్ ఫతాహ్ నేతృత్వంలోని వైద్యుల బృందం జీవన్దాన్ ద్వారా సేకరించిన మూత్రపిండాన్ని ఆ రోగికి అమర్చారు. ఈ సందర్భంగా డాక్టర్ ఫైస్టా హుస్సేని మాట్లాడుతూ ప్రతి మిలియన్ ప్రజల్లో సుమారు 150 నుంచి 230 మంది ఎండ్ స్టేజీ కిడ్నీ వ్యాధితో బాధపడుతున్నారన్నారు. ఆ యువ రోగికి జీవితకాలం డయాలసిస్ అవసరం లేకుండా కిడ్నీ మార్పిడిని విజయవంతంగా నిర్వహించామని చెప్పారు.