సిటీబ్యూరో, జూలై 2 (నమస్తే తెలంగాణ): పార్కింగ్ చేసిన కార్లను దొంగిలించి, నంబర్ ప్లేట్లను మార్చి తక్కువ ధరకు విక్రయిస్తున్న అంతరాష్ట్ర ముఠాను ఈస్ట్జోన్ టాస్క్ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. నగర పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీపీ అంజనీకుమార్ వివరాలు వెల్లడించారు. ఉత్తర్ప్రదేశ్, మిరాట్ జిల్లాకు చెందిన మహ్మద్ హసీన్ 2014లో హైదరాబాద్కు వచ్చి అత్తాపూర్లో కొన్నాళ్లు కారు మెకానిక్గా పనిచేసి తిరిగి తన స్వస్థలం వెళ్లిపోయాడు. ఢిల్లీలో అస్లం అనే వ్యక్తితో కలిసి కార్లను దొంగిలిస్తుండటంతో 2019లో ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. జైలు నుంచి బయటకు వచ్చిన తరువాత యూపీలోని అలీగఢ్లో పార్కింగ్ చేసిన కారును దొంగిలించి, నంబర్ ప్లేటు మార్చి తక్కువ ధరకు శంషాబాద్లోని శేషుకుమార్, మధుసూదన్ అనే సెకెండ్ హ్యాండ్ కార్ల డీలర్లకు విక్రయించాడు.
ఈ ఏడాది జనవరిలో తమ స్వస్థలానికి చెందిన మహబూబ్, అబెద్తో కలిసి హైదరాబాద్కు వచ్చారు. ఈ క్రమంలోనే పార్కింగ్ చేసిన కార్లను దొంగిలించి శంషాబాద్లోని శేషుకుమార్, మధుసూదన్లకు తక్కువ ధరకు అమ్మేస్తున్నారు. ఈ నెల 13న కంచన్బాగ్లో, 25న మలక్పేట్లో పార్కింగ్ చేసిన కార్లను దొంగిలించారు. విశ్వసనీయ సమాచారం మేరకు ఈస్ట్జోన్ టాస్క్ఫోర్స్ ఇన్స్పెక్టర్ కె.శ్రీనివాస్ బృందం శుక్రవారం హసీన్, శేషుకుమార్, మధుసూదన్లను అరెస్ట్ చేశారు. యూపీకి చెందిన మహబూబ్, అబేద్లు పరారీలో ఉన్నారు. నిందితుల వద్ద నుంచి ఒక స్విఫ్ట్, ఒక ఐ-20 కార్తో పాటు దొంగతనానికి ఉపయోగించిన కిట్స్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. తదుపరి విచారణ నిమిత్తం కేసును కంచన్బాగ్ పోలీసులకు అప్పగించారు.