దుండిగల్, ఫిబ్రవరి 23: ఎదురెదురుగా వస్తున్న టిప్పర్, కారు ఢీకొన్న సంఘటనలో కార్ డ్రైవర్ క్యాబిన్లో ఇరుక్కుని అక్కడికక్కడే దుర్మరణం(Car driver dies) చెందాడు. ఈ సంఘటన దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బౌరంపేట స్నేక్ పార్క్ వద్ద ఆదివారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. కొంపల్లి మున్సిపాలిటీ పరిధిలోని దూలపల్లికి చెందిన పున్నాల నాగ వంశీ(22) అనే యువకుడు ఆదివారం ఉదయం కారు(టీఎస్ 16 ఎఫ్ కే -2367)లో మియాపూర్ వైపు నుంచి గండిమైసమ్మ చౌరస్తా వైపు వెళ్తున్నాడు.
ఇదే క్రమంలో గండి మైసమ్మ చౌరస్తా వైపు నుంచి ప్రగతి నగర్ వైపు వెళ్తున్న టిప్పర్ (టీఎస్08,యూ ఎల్ 3967) వేగంగా దూసుకొచ్చి కారును ఢీ కొట్టింది. దీంతో కారు ముందు భాగం నుజ్జు నుజ్జు కావడంతో కారు క్యాబిన్లో ఇరుక్కున్న నాగవంశీ అక్కడికక్కడే దుర్మరణం చెందా డు. అదే సమయంలో కారు వెనకాలే వస్తున్న బైక్ అదుపుతప్పి కింద పడడంతో బైక్ నడుపుతున్న బాచుపల్లకి చెందిన చిత్తూరి వెంకట సురేంద్ర కాలికి గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం గాంధీ వైద్యశాలకు తరలించారు. క్షతగాత్రుడిని చికిత్స కోసం హాస్పిటల్కు తరలించారు. కేసు దర్యాప్తులో ఉంది.