సిటీబ్యూరో, నవంబర్ 25 (నమస్తే తెలంగాణ) : గెలుపు..ఓటమి..! పోటీ అన్నాక ఇందులో ఏదో ఒకటి పొందాల్సిందే. అది గెలుపులో కావొచ్చు.. ఓటమీ కావొచ్చు. ఇది తప్పనిసరిగా ఎదుర్కోవాల్సిన ఫలితం. అయితే ప్రస్తుతం రాష్ట్రంలో ఎన్నికల సమరం నడుస్తున్నది. అమీతుమీ తేల్చుకోవడానికి అభ్యర్థులు శక్తికి మించి శ్రమపడుతున్నారు. నెలన్నరగా అభ్యర్థులు ప్రచారంలో బిజీగా ఉన్నారు. కంటి మీద కునుకు లేకుండా కార్యకర్తలతో సమావేశాలు, ఇంటింటి ప్రచారం, నాయకుల మీటింగ్లు ఇలా సవాలక్ష పనులను చక్కబెట్టాల్సిన పరిస్థితి వారిది. ఇప్పుడు ఈ బిజీలైఫ్ వారిలో కొత్త తలనొప్పులను తీసుకొస్తున్నది. సరిపడా నిద్ర లేక గ్రేటర్లోని కొంతమంది అభ్యర్థులు తెగ ఇబ్బంది పడుతున్నారని ఓ వైద్యుడు చెప్పారు. ఒత్తిడితో సతమతమవుతున్నారని తెలిసింది. ఇదివరకే షుగర్, బీపీలున్న కొంతమంది అభ్యర్థులకు అనారోగ్య సమస్యలు ఎక్కువవుతున్నాయని ఆందోళన చెందుతున్నారు.
ప్రచారం మొదలైనప్పటి నుంచి తీరిక లేకుండా సమయానికి తిండి సరిగా తినకుండా ప్రజల్లో తిరుగుతూ.. ప్రతి ఒక్కరి వద్దకు వెళ్లి పలకరిస్తూ కాలినడకన సాగుతున్నారు. రాత్రి ప్రచారం ముగిసినా కూడా ముఖ్య నేతలతో టెలీకాన్ఫరెన్స్లు, రహస్య మీటింగ్లతో మళ్లీ బిజీ అవుతున్నారు. అవన్నీ పనులు ముగించుకుని ఇంటికొచ్చే సరికి అర్ధరాత్రి 2 దాటుతుందని ఓ అభ్యర్థి కుటుంబసభ్యులు తెలిపారు. మళ్లీ మరుసటి రోజు సేమ్ టైంటేబుల్. ఇలా వరుసగా బిజీగా గడుపుతుండటమే వారి అనారోగ్యానికి కారణమైందని వైద్యులు చెబుతున్నారు.
కూల్.. కూల్.. కూల్..!
ఇప్పుడు అందరిని కలవరపెడుతున్నది గెలుపు. గెలుస్తానా? లేదా?.. డబ్బులు ఖర్చు పెడుతున్నాను? ఓట్లు వేస్తారా? లేదా?.. అనే సవాలక్ష అనుమానాలతో అభ్యర్థులు టెన్షన్కు గురవుతున్నారు. ఒత్తిడితో మానసిక క్షోభ అనుభవిస్తున్నారు. కాళ్లు, నడుము నొప్పులతో బాధపడుతున్నారని సమాచారం. ఇలాంటి సమయంలో కొంతమంది అభ్యర్థులు వైద్యులను సంప్రదించి సూచించిన పరీక్షలు సైతం చేయించుకుంటున్నారు. వైద్యుల సూచనలతోపాటు కాసేపు యోగా, మెడిటేషన్ చేస్తున్నారు. తప్పనిసరిగా యోగా చేయకుండా ప్రచారానికి వెళ్లొద్దని వైద్యులు సూచిస్తున్నారు. ప్రశాంతంగా ఉండటానికి ప్రయత్నించాలని చెబుతున్నారు.