సిటీబ్యూరో, ఫిబ్రవరి 4 (నమస్తే తెలంగాణ): దేశంలో ప్రతియేటా 14లక్షల క్యాన్సర్ కేసులు నమోదవుతున్నాయని, అందులో 8 లక్షల వరకు మరణాలు వెలుగు చూస్తున్నాయని కిమ్స్ ఎండీ డాక్టర్ భాస్కర్రావు అన్నారు. వరల్డ్ క్యాన్సర్ డేను పురస్కరించుకొని కిమ్స్ దవాఖానలో శనివారం వ్యాధిపై అవగాహనతోపాటు జీహెచ్ఎంసీ మహిళా కార్మికులు 400 మందికి ఉచితంగా క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎండీ డాక్టర్ భాస్కర్రావు, డైరెక్టర్ డాక్టర్ పి.రఘురాం మాట్లాడుతూ.. 50 ఏండ్లు దాటిన మహిళలు క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు చేసుకోవాలని సూచించారు. ఏటా దేశంలో 2 లక్షల రొమ్ము క్యాన్సర్ కేసులు నమోదవుతున్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక పేర్కొన్నదని చెప్పారు. మహిళలు అప్రమత్తంగా ఉండేందుకు అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు తెలిపారు.