బాలానగర్, జూలై 28: కొత్తగా పరిశ్రమలు ఏర్పాటు చేయదలచిన వారికి, ఇప్పటికే పరిశ్రమలు ఏర్పాటు చేసిన వారికి పారిశ్రామిక రంగంలో రాణించేందుకు కెనరా బ్యాంక్ పూర్తి సహకారం అందిస్తున్నదని కెనరా బ్యాంక్ డిఫ్యూటీ జనరల్ మేనేజర్ అనంత్ జల్హోన అన్నారు. బాలానగర్ నర్సాపూర్ చౌరస్తాలోని కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఎంఎస్ఎంఈ (సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల అభివృద్ధి సంస్థ) ఆడిటోరియం హాలులో గురువారం ఏర్పాటు చేసిన అవగాహన సదస్సుకు జిల్లా పరిశ్రమల కేంద్రం డిఫ్యూటీ డైరెక్టర్ యాదయ్యలతో పాటు పలు తెలంగాణ రాష్ట్ర ఫుడ్ ప్రాసెసింగ్, సెంట్రల్ ఫుడ్ అండ్ టెక్నోలాజికల్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్, సెంట్రల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడిసినల్ అండ్ ఆరోమాటిక్స్ ప్లాంట్స్, కెనరా బ్యాంక్ ఎంఎస్ఎంఈ డెవలప్మెంట్ అండ్ ఫెసిలిటేషన్ కార్యాలయానికి చెందిన రిసోర్స్ పర్సన్లు, బ్యాంకుల ప్రతినిధులు హాజరయ్యారు.
ఈ సందర్భంగా అనంత్ జల్హోన మాట్లాడుతూ కెనరా బ్యాంక్ ఇప్పటికే పరిశ్రమలు నడిపిస్తున్న పారిశ్రామిక వేత్తలకు సహకారం అందిస్తున్నదని తెలిపారు. అదే విధంగా కొత్తగా ఏర్పాటు చేయదలిచిన పరిశ్రమలకు సైతం సహకారం అందించి పారిశ్రామిక రంగంలో నిలదొక్కుకునేందుకు కృషి చేస్తామన్నారు. కార్యక్రమంలో వివిధ విభాగాల ప్రభుత్వ అధికారులు తదితరులు పాల్గొన్నారు.