మణికొండ, జూన్ 27: పాదచారులకు సురక్షితమైన పుట్పాత్లను అందుబాటులోకి తీసుకురావాలనే లక్ష్యంతో సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ప్రత్యేక డ్రైవ్ నిర్వహించింది. డిప్యూటీ కమిషనర్ల పర్యవేక్షణలో టౌన్ప్లానింగ్ విభాగం, పోలీసు శాఖ సమన్వయంతో చేపట్టిన కార్యక్రమంలో పుట్పాత్లను ఆక్రమించిన ఆహార స్టాళ్లు, వీధి వ్యాపారాలు, తాత్కాలిక నిర్మాణాలు తదితర అనధికార ఆక్రమణలను తొలగించారు. శేరిలింగంపల్లి జోన్ పరిధిలోని నార్సింగి సర్కిల్ గండిపేట ఎక్స్ రోడ్ నుంచి సాయిబాబా దేవాలయం వరకు పుట్పాత్లపై ఉన్న ఆక్రమణలను తొలగించారు.
అలాగే పటాన్చెరువు, అమీన్పూర్, మియాపూర్, శేరిలింగంపల్లి సర్కిళ్లల్లోనూ ప్రత్యేక చర్యలు చేపట్టారు. ఈ జోన్లో మొత్తం 5 రహదారి విభాగాల్లో 10.8 కిలోమీటర్ల మేర పుట్పాత్లను ఆక్రమణల నుంచి విముక్తం చేసి 197 ఆక్రమణలను తొలగించారు. అలాగే కూకట్పల్లి జోన్లోని మూడు రహదారి విభాగాల్లో 3.16 కి.మీ మేర 105 ఆక్రమణలు, కుత్బుల్లాపూర్ జోన్లో ఏడు రహదారి విభాగాల్లో 15.53 కి.మీ మేర 204 ఆక్రమణలను తొలగించారు. మొత్తం 30.29 కిలోమీటర్ల పుట్పాత్లను ఆక్రమణల నుంచి విముక్తం చేశారు.