సిటీబ్యూరో, నవంబర్ 16 (నమస్తే తెలంగాణ) : అఖండ భారతావని వందల శతాబ్దాల నాటి చరిత్రలకు పెట్టని గని. అనేక సంస్కృతులకు పురుడుపోసి జనజీవనాన్ని పురోగమించే దిశగా చారిత్రక ఘట్టాలకు గొప్ప వేదికగా నిలిచిన దేశమిది. అలాంటి చారిత్రక మలుపుల్లో.. హింస కూడదని ఉపదేశించి శాంతిని వచించిన గొప్ప అభ్యుదయవాది గౌతమ బుద్ధుడు. ఆయన జననం నుంచి మహా పరినిర్యాణం వరకు సాగిన జీవన యానం ఒక ఎైత్తెతే వందలాది జాతక కథల ద్వారా సమాజాన్ని సరైన దారిలో పెట్టేందుకు ఆ సాహిత్యం ద్వారా జరిగిన అవిరళ కృషి మరో ఎత్తు. అయితే వీటన్నింటిని ప్రతిబింబిస్తూ.. నాగార్జున సాగర్ వద్ద ఉన్న నాగార్జున కొండపై వెలసిన బుద్ధవనం గౌతముడి జీవనాన్ని కళ్లకు కట్టినట్టు చూపిస్తున్నది. ఈ నేపథ్యంలో ఈ విశేషాలన్నింటినీ ప్రోది చేసి రెండు నిమిషాల్లో ఒక డాక్యుమెంటరీలో ఆవిష్కరించిన ఓ తెలంగాణ యువకుడు మరిన్ని ప్రశంసలు అందుకుంటున్నాడు.
274 ఎకరాల్లో..
ప్రపంచంలోనే అతిపెద్ద బుద్ధిస్ట్ హెరిటేజ్ థీమ్ పార్కును తెలంగాణ ప్రభుత్వం నాగార్జున కొండపై ఏర్పాటు చేసింది. ఆసియాలోనే అతిపెద్ద మహాస్థూపాన్ని అందమైన థీమ్పార్కును నిర్మించింది. శ్రీలంక, మయన్మార్, థాయ్లాండ్ నుంచి బౌద్ధ శిల్పులను రప్పించి చారిత్రక విశేషాల శిల్పాలను, చిత్రాలను చెక్కించారు. అంతేకాకుండా గౌతమబుద్ధుడి విగ్రహాలకు అదనపు ఆకర్షణ వచ్చేలా విద్యుత్ దీపాల వెలుగులను అమర్చారు. శాంతివచనాలను వెదజల్లుతున్నట్లుగా ఒకవైపు ఆకుపచ్చని హారం, మరోవైపు పాలలాంటి తెలుపు రంగుల్లో మిళమిళా మెరుస్తున్న బౌద్ధ స్థూపాలు చూపరులను ఆకట్టుకుంటున్నాయి. శిల్పులు చెక్కిన జాతక (దీపాంకర) కథలు.. శిలలపై 40 కుఢ్య చిత్రాల శైలిలో దర్శినమిస్తాయి. దేశంలోని వివిధ బౌద్ధ ప్రాంతాల నుంచి సేకరించి తీసుకొచ్చిన చిన్న స్థూపాలను స్థూప వనంలో ప్రదర్శనలో ఉంచారు. బౌద్ధ బిక్కులు ప్రార్థనలు చేసేందుకు ప్రత్యేకంగా తీర్చిదిద్దిన ప్రదేశం ఆధ్యాత్మిక పరిమళాలు వెదజల్లుతున్నది. ఆచార్య నాగార్జునుడు నడయాడిన నందికొండ, ఆయన బోధించిన వచనాల విశేషాలను ప్రదర్శిస్తూ బుద్ధవనం చరిత్రకు నిలువుటద్దంలా నిలిచింది.
పీఆర్సీఐ పురస్కారం
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందించిన ఈ బుద్ధవనం ప్రాజెక్టుపై డీఎస్ఎన్ ఫిలింస్ ఓ డాక్యుమెంటరీని రూపొందించింది. అనేక డాక్యుమెంటరీల రూపకల్పనలో విశేష అనుభవం కలిగిన ఆ సంస్థ సీఈఓ దూలం సత్యనారాయణ.. బుద్ధవనం శిల్పకళలను, చారిత్రక విశేషాలను, తథాగథుడి గాథను రెండు నిమిషాల నిడివిలో చిత్రించగలిగారు. కోల్కతా గ్లోబల్ కమ్యూనికేషన్ కాన్క్లేవ్లో భాగంగా పబ్లిక్ రిలేషన్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (పీఆర్సీఐ) నవంబర్ 12న ఐదు అవార్డులను అందజేసింది. కళలు సంస్కృతి విభాగంలో భాగంగా బుద్ధవనంపై చిత్రించిన డాక్యుమెంటరీకి క్రిస్టల్ పురస్కారాన్ని ఇచ్చారు.
తెలంగాణ బిడ్డగా..
నేను రూపొందించిన ఫిలింస్కు అవార్డులు లభించడం గొప్పవిషయంగా భావిస్తున్నా. డీఎస్ఎన్ ఫిలింస్ సాధిస్తున్న విజయాలకు సీఎం కేసీఆర్, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ నిరంతర మద్దతు, ప్రోత్సాహం మరువలేనిది. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజల్లోకి చేరవేసేందుకు అవకాశం ఇచ్చిన ప్రభుత్వానికి, సహకరించిన అధికారులకు తెలంగాణ బిడ్డగా ధన్యవాదాలు చెబుతున్నా.
– డీఎస్ఎన్ ఫిలింస్ సీఈఓ దూలం సత్యనారాయణ