కేపీహెచ్బీ కాలనీ, మార్చి 26 : కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంపై వివక్షత చూపుతుందని, టాక్స్ల రూపంలో కేంద్రానికి వేలాది కోట్లు చెల్లిస్తుంటే రాష్ర్టానికి రావాల్సిన వాటా కంటే అదనంగా నయాపైసా కూడా ఇవ్వడంలేదని ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రెడ్డి అన్నారు. ఆదివారం కేపీహెచ్బీ కాలనీ మొదటి రోడ్డు కమ్యూనిటీ హాల్లో కూకట్పల్లి నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల ఆత్మీయ సమావేశానికి ముఖ్య అతిథులుగా మేడ్చల్ జిల్లా పరిశీలకులు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రెడ్డి, కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు, ఎమ్మెల్సీ కుర్మయ్యగారి నవీన్కుమార్ హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రెడ్డి మాట్లాడుతూ.. నగర శివారు ప్రాంతమైన కూకట్పల్లి అనేక ప్రాంతాలు కులాలు, మతాలకు సమ్మిళితమని.. సంక్లిష్టమైన ప్రాంతంలో ప్రజలందరిని ఏకతాటిపై నడిపిస్తున్న ఎమ్మెల్యే కృష్ణారావు ఎనిమిదేండ్ల పాలనలో సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ల సహకారంతో కనీవినీ ఎరుగని రీతిలో అభివృద్ధి చేశారని అన్నారు. సీఎం కేసీఆర్ పాలనలో రాష్ట్రం అన్ని రంగాల్లో శరవేగంగా అభివృద్ధిని సాధించిందన్నారు. రాష్ట్రంలో పంటనష్టం కలిగిన రైతులకు రూ.10వేల సహాయం అందిస్తున్న ఘనత సీఎం కేసీఆర్దేనన్నారు. కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, కార్పొరేటర్లు ప్రజాసేవ చేస్తుంటే బీజేపీ నేతలు మాత్రం అసత్యాలను ప్రచారం చేస్తూ పబ్బం గడుపుతున్నారని, ఇలాంటి అసత్య ప్రచారాలను ఎప్పటికప్పుడు తిప్పికొట్టాల్సిన బాధ్యత బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలపై ఉందని ఎమ్మెల్సీ పల్లా అన్నారు. కూకట్పల్లిలో మూడోసారి గులాబీ జెండా రెపరెపలాడాలని పిలుపునిచ్చారు.
కూకట్పల్లిలో ఒక్క గుడి కట్టారా..?
నిత్యం రాముడు.. మతం పేరుతో రాజకీయాలు చేసే బీజేపీ నేతలు కూకట్పల్లి నియోజకవర్గంలో ఒక్క గుడినైనా నిర్మించారా? అని, ఎనిమిదేండ్ల కాలంలోనే కూకట్పల్లిలో వందేండ్ల చరిత్ర కలిగిన రామాలయాన్ని అత్యద్భుతంగా పునర్నిర్మించడం, మూసాపేట లక్ష్మీనర్సింహస్వామి దేవాలయం, ఫతేనగర్ శివాలయం, కేపీహెచ్బీ కాలనీలో శివాయాలను నిర్మించిన ఘనత తనకుందని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు తెలిపారు.
నియోజకవర్గంలో నవరత్నాల్లాంటి కార్పొరేటర్లు, క్రమశిక్షణకు మారుపేరైన బీఆర్ఎస్ పార్టీ నేతలు, కార్యకర్తల సహకారంతో ఎనిమిదేండ్లలో కూకట్పల్లిని ఆదర్శవంతంగా అభివృద్ధి చేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు మందడి శ్రీనివాస్రావు, పగుడాల శిరీష, సబీహాబేగం, పండాల సతీశ్ గౌడ్, ముద్దం నర్సింహ యాదవ్, ఆవుల రవీందర్ రెడ్డి, జూపల్లి సత్యనారాయణ, మహేశ్వరి, మాజీ కార్పొరేటర్లు బాబురావు, శ్రవణ్కుమార్, నియోజకవర్గం కోఆర్డినేటర్ సతీశ్ అరోరా, ఆయా డివిజన్ల అధ్యక్ష, కార్యదర్శులు, ముఖ్య నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.
బీఆర్ఎస్లోకి 300 మంది బీజేపీ నేతలు
రాష్ట్రంలో సీఎం కేసీఆర్ పాలనలో జరిగిన అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆకర్షితులై బీజేపీతో పాటు పలు పార్టీల నేతలు బీఆర్ఎస్లో చేరుతున్నట్లు ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రెడ్డి, కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. ఆదివాలరం కేపీహెచ్బీ కాలనీలో జరిగిన సమావేశంలో ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వర్రెడ్డి, కుర్మయ్యగారి నవీన్కుమార్, శంభీపూర్ రాజుల సమక్షంలో బాలానగర్ కార్పొరేటర్ ఆవుల రవీందర్రెడ్డి ఆధ్వర్యంలో డివిజన్కు చెందిన బీజేపీ నాయకులు గోగాడి మహేశ్కుమార్, సంద్ర సునీల్కుమార్, వాసుల ఆధ్వర్యంలో 100 మంది నేతలు బీఆర్ఎస్లో చేరారు. అలాగే కేపీహెచ్బీ కాలనీ డివిజన్ కార్పొరేటర్ మందడి శ్రీనివాస్రావు ఆధ్వర్యంలో బీజేపీ నేతలు కోదండరామయ్య, మురళీ, నిఖిల్, రాంబాబు, పండు, శివరావ్, నాగమణి, నాగేశ్వరి, బ్రహ్మచారి, వెంకటేశ్, మల్లికార్జున్రావు, శశిధర్, హేమంత్, అనీల్, ఆనంద్, చంద్ర, జయానాయక్, మధులతో పాటు 200 మంది నాయకులు బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు.