దుండిగల్,డిసెంబర్ 3: కుత్బుల్లాపూర్ నియోజకవర్గం నుండి బీఆర్ఎస్ అభ్యర్థి కేపీ.వివేకానంద్ ఘనవిజయం సాధించారు. ఎవరూ ఊహించని రీతిలో రాష్ట్రంలోనే అత్యధిక మెజార్టీ సాధించిన ఎమ్మెల్యేగా రికార్డు సృష్టించారు. సమీప ప్రత్యర్థి బీజేపీ నాయడు కూన శ్రీశైలంగౌడ్పై 85,400 ఓట్ల భారీ మెజార్టీతో గెలుపొందారు. అదేసమయంలో కుత్బుల్లాపూర్ నియోజకవర్గం నుంచి హ్యాట్రిక్ విజయం సాధించిన మొట్టమొదటి ఎమ్మెల్యేగాను రికార్డు పుటల్లోకి ఎక్కాడు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోమొత్తం 6లక్షల99వేల130మంది ఓటర్లు ఉండగా 3లక్షల99వేల852 మంది ఓటర్లు మాత్రమే తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
నియోజకవర్గం పరిధిలో మొత్తం 590 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయగా 3లక్షల99వేల852 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. మొత్తంగా నియోజకవర్గం పరిధిలో 57.19 శాతం ఓటింగ్ నమోదు అయిన విషయం విధితమే. ఈ క్రమంలో కీసరమండలం, బోగారంలోని హోలీమేరి కళాశాలలో ఆదివారం నిర్వహించిన ఓట్ల లెక్కింపులో బీఆర్ఎస్ అభ్యర్థి కేపీ.వివేకానంద్ ఘన విజయం సాధించారు. మొత్తం 22 రౌండ్లలో ఓట్లను లెక్కించగా ప్రతిరౌండులోనూ వివేకానంద్ స్పష్టమైన ఆధిక్యం కనబరిచారు. 85వేల400 ఓట్ల మెజార్టీతో అద్బుతవిజయం సాధించారు.
బీజేపీ, కాంగ్రెస్ పార్టీల అభ్యర్థులు రెండు, మూడు స్థానాలతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఏ ఒక్క రౌండ్లోనూ బీజేపీ అభ్యర్థి కూన శ్రీశైలంగౌడ్ గానీ, కాంగ్రెస్ అభ్యర్థి కొలన్ హన్మంత్రెడ్డి గానీ ఢీ కొట్టేప్రయత్నం చేయలేక పోయారు. పోలైన ఓట్లల్లో ఎమ్మెల్యే వివేకానంద్ 1లక్ష87వేల327 ఓట్లు సాధించగా, బీజేపీ అభ్యర్థి కూన శ్రీశైలంగౌడ్ 1లక్ష1వేయి927 ఓట్లు, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కొలన్ హన్మంత్రెడ్డి 1లక్ష 884 మాత్రమే దక్కించుకున్నారు. బరిలో నిలిచిన మరో 13మంది తమ డిపాజిట్ను కోల్పోయారు. వీరిలో బీఎస్పీ నుంచి మహ్మద్ ఆహ్మద్లిమ్రా పోటీచేయగా మిగతా వారు స్వతంత్య్ర అభ్యర్థులుగా పోటీచేశారు.
పోస్టల్ బ్యాలేట్ ఓట్లలోనూ ఎమ్మెల్యే వివేకానంద్ ఆధిక్యం కనబరిచారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గానికి సంబందించి మొత్తం 1927 ఓట్లు ఉండగా బీఆర్ఎస్ అభ్యర్థి ఎమ్మెల్యే వివేకానంద్కు 672 ఓట్లు పోల్కాగా 670 ఓట్ల దక్కించుకోగా బీజేపీ అభ్యర్థి కూనశ్రీశైలంగౌడ్కు 496 ఓట్లు పోలయ్యాయి.
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం నుండి పోటీపడిన ప్రధాన పార్టీలైన బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ అభ్యర్థుల తర్వాత అత్యధిక ఓట్లు నోటాకు పోలవడం గమనార్హం. ఇక్కడ బీఎస్పీ అభ్యర్థికి మొత్తం 1751 ఓట్లు పోల్కాగా నోటాకు మాత్రం 4079 ఓట్లు పోలయ్యాయి. మిగతా 11మంది అభ్యర్థులు వీరి దరిదాపుల్లో లేకపోవడం గమనార్హం.
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం రాజకీయచరిత్రలో ఎమ్మెల్యే వివేకానంద్ హ్యాట్రిక్ విజయం సాధించి చరిత్ర సృష్టించారు. ఉమ్మడి మేడ్చల్ నియోజకవర్గంలో అంతర్భాగంగా ఉన్న కుత్బుల్లాపూర్ పునర్విభజనలో కుత్బుల్లాపూర్ నియోజకవర్గంగా ఏర్పాటైంది. 2009లో తొలిసారి కుత్బుల్లాపూర్ నియోజకవర్గానికి ఎన్నికలు జరుగగా నాడు స్వతంత్య్ర అభ్యర్థిగా పోటీ చేసిన కూన శ్రీశైలంగౌడ్ టీఆర్ఎస్ అభ్యర్థిపై గెలుపొందారు. అనంతరం రాష్ట్ర ఏర్పాటు జరుగగా 2014లో ఎన్నికలల్లో టీడీపీ అభ్యర్థిగా పోటీచేసిన కేపీ.వివేకానంద్ టీఆర్ఎస్ అభ్యర్థి కొలన్ హన్మంత్రెడ్డిపై గెలుపొందారు. అనంతరం 2016లో ఎమ్మెల్యే వివేకానంద్ టీఆర్ఎస్లో చేరగా 2018లో జరిగిన ఎన్నికల్లో టీఆర్ఎస్ నుంచి బరిలో దిగి కాంగ్రెస్ అభ్యర్థిపై ఘనవిజయం సాధించారు. ప్రస్తుతం బీఆర్ఎస్ నుంచి బరిలో దిగిన ఎమ్మెల్యే కేపీ.వివేకానంద్ బీజేపీ అభ్యర్థి కూన శ్రీశైలంగౌడ్పై అత్యధిక మెజార్టీ(85వేల400) సాధించి హ్యాట్రిక్ విజయం సాధించారు.
ఎన్నికల్లో విజయం సాధించిన అనంతరం ఎమ్మెల్యే వివేకానంద్ కౌంటింగ్ కేంద్రం బయట ఏర్పాటు చేసిన మీడియా పాయింట్ వద్ద మాట్లాడారు. తనకు హ్యట్రిక్ విజయం అందించిన కుత్బుల్లాపూర్ నియోజకవర్గం ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. ఇంతటి విజయాన్ని తాను ఊహించలేదన్నారు. తనకు ఘనవిజయం అందించిన ప్రజలకు ఎల్లప్పుడు రుణపడి ఉంటానన్నారు.
రాష్ట్ర స్థాయిలోనే అత్యధిక మెజార్టీని కట్టబెట్టి తనపై నమ్మకం ఉంచిన ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్నారు.అదే సమయంలో బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, నేతలు తన విజయానికి ఎంతోకృషిచేశారని,వారందరికి ప్రత్యేక ధన్యవాధాలు తెలిపారు. వారి రుణం ఎన్నటికీ తీర్చుకోలేనిదన్నారు. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ అండదండలతో నియోజకవర్గంలో రూ.6కోట్ల పై చిలుకు నిధులతో అభివృద్ధి చేశామని, దాని కృషి ఫలితంగానే ప్రజలు తనకీ విజయం అందించడం సంతోషంగా ఉందన్నారు.