హైదరాబాద్ : భారత్–అమెరికా మధ్య చరిత్రాత్మక వాణిజ్య ఒప్పందానికి సంబంధించిన సాక్షాలను మాత్రం కేంద్ర ప్రభుత్వం బహిర్గతం చేయడం లేదని, సర్కార్ మౌనం తెలంగాణలో తీవ్ర అనుమానాలకు తావిస్తోందని తెలంగాణ ప్రదేశ్ మహిళా కాంగ్రెస్ ఉపాధ్యక్షురాలు డా. రేఖ బోయలపల్లి (Boyalapalli Rekha) మండిపడ్డారు.
యూఎస్తో భారీ వ్యాపార ఒప్పందం జరిగిందని ప్రకటనలు వస్తున్నా.. ఇప్పటివరకు ఒక్క అధికారిక పత్రం కూడా ప్రజల ముందుకు రాలేదని ఆమె నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని విమర్శించారు. ఎంఓయూ ఎక్కడ? టారిఫ్ల వివరాలెక్కడ? రైతులు, MSMEలు, ఐటీ డేటా భద్రతపై హామీలు ఎక్కడ? అని రేఖ ప్రశ్నల వర్షం కురిపించారు.
“అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్తో వాణిజ్య ఒప్పందం చేసుకున్నామని బహిరంగంగా మాట్లాడుతున్నారు. కానీ, మన ప్రధాని మోడీ మాత్రం నిశ్శబ్దం పాటిస్తున్నారు. హైదరాబాద్ స్టార్టప్లు, నల్లగొండ రైతులు, సూర్యాపేట డెయిరీ కార్మికుల భవితవ్యానికి అడ్డుపడిన.. ఆ మూసిన తలుపుల వెనుక ఎవరి చేతులు ఉన్నాయి?” అని మోడీ ప్రభుత్వాన్ని బోయలపల్లి రేఖ నిలదీశారు. ఈ ఒప్పందం వల్ల తెలంగాణ వ్యవసాయం, చిన్న పరిశ్రమలు, యువత ఉద్యోగాలపై ఎలాంటి ప్రభావం ఉంటుందో చెప్పాల్సిన బాధ్యత కేంద్రంపై ఉందని ఆమె అన్నారు. ప్రజలకు తెలియకుండా తీసుకునే నిర్ణయాలు ప్రజాస్వామ్యానికి విరుద్ధమని రేఖ స్పష్టం చేశారు.
నిజంగానే యూఎస్తో డీల్ దేశానికి లాభదాయకమైతే .. గోప్యంగా ఉంచాల్సిన అవసరం ఏముంది? అని ప్రశ్నించిన డా. రేఖ.. ఒప్పందం పూర్తి వివరాలను వెంటనే విడుదల చేసి, పార్లమెంట్లో చర్చ జరపాలని డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రయోజనాలను పణంగా పెట్టే ఏ ఒప్పందాన్నీ కాంగ్రెస్ పార్టీ సహించదని, రైతులు–MSMEలకు భరోసా ఇచ్చే వరకు పోరాటం ఆగదని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ ఉపాధ్యక్షురాలు హెచ్చరించారు.