సిటీబ్యూరో, జూలై 26 (నమస్తే తెలంగాణ) : ఆషాఢ బోనాల ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. పాతనగరం పరిధిలోని ఆలయాలకు ప్రభుత్వం మంజూరు చేసిన సుమారు రూ.2.37 కోట్ల చెకులను మంగళవారం ఆయా ఆలయాల కమిటీ సభ్యులకు అందజేయనున్నట్లు చెప్పారు. ఉదయం ఛత్రినాకలోని ఆర్డీ ఫంక్షన్ హాల్లో 324 దేవాలయాలకు సంబంధించిన చెకులను పంపిణీ చేయనున్నామని, ఇందులో ఉమ్మడి దేవాలయాలు 180, చాంద్రాయణగుట్ట నియోజకవర్గం పరిధిలోని 47, బహదూర్పురా నియోజకవర్గం పరిధిలోని 27, యాకుత్పురా నియోజకవర్గం పరిధిలోని 61, చార్మినార్ నియోజకవర్గం పరిధిలోని 09 దేవాలయాలు ఉన్నాయని తెలిపారు. మధ్యాహ్నం 12.00 గంటలకు బేగంబజార్లోని సుంగ్రిషి భవన్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో గోషామహల్ నియోజకవర్గం పరిధిలోని 118 దేవాలయాలకు రూ.36.48 లక్షల చెకులను అందజేయనున్నట్లు వెల్లడించారు.
కార్వాన్లోని దర్బార్ మైసమ్మ ఆలయం వద్ద ఏర్పాటు చేయనున్న కార్యక్రమంలో కార్వాన్ నియోజకవర్గం పరిధిలోని 130 దేవాలయాలకు రూ.47.98 లక్షల చెకులను ఆయా ఆలయాల కమిటీ సభ్యులకు అందజేస్తామని మంత్రి తలసాని పేర్కొన్నారు. గత సంవత్సరం కరోనా నేపథ్యంలో బోనాలను నిర్వహించలేదని, ఈ సంవత్సరం ఘనంగా నిర్వహించాలన్న ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఆదేశాల మేరకు భక్తులు ఎలాంటి అసౌకర్యానికి గురికాకుండా ప్రభుత్వం అన్ని ఏర్పాట్లను చేసిందన్నారు. ఈ సంవత్సరం బోనాల నిర్వహణ కోసం రూ.15 కోట్లు వివిధ ఆలయాలకు అందజేస్తున్నదని తెలిపారు. ఈ ఆర్థిక సహాయాన్ని బోనాల ఉత్సవాలకు ముందే పంపిణీ చేస్తామని ప్రకటించిన ప్రకారం ఆగస్టు 1వ తేదీన బోనాలు నిర్వహించనున్న ఓల్డ్ సిటీ పరిధిలోని ఆలయాలకు ఆర్థిక సహాయం చెకులు పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు.