శంషాబాద్, జూలై 25: శంషాబాద్లో ఆదివారం ఘనంగా బోనాల ఉత్సవాల సంబురాలు అంబరాన్నంటాయి. బోనాల నిర్వహణకు మున్సిపల్ ఆధ్వర్యంలో భారీ ఏర్పాట్లు చేశారు. పట్టణంలోని పలు కాలనీల్లో గ్రామదేవతలు, బొడ్రాయిలను ముస్తాబు చేశారు. అమ్మవారి ఆలయాలను రంగులతో పాటు రంగురంగుల విద్యుద్దీపాలతో అలంకరించారు. బోనాల ఉత్సవాలకు ముఖ్యఅతిథిగా హాజరైన ఎమ్మెల్యే ప్రకాశ్గౌడ్, శంషాబాద్ మున్సిపల్ చైర్పర్సన్ సుష్మారెడ్డి అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. వారికి పలు కాలనీలు, ఆలయాల ఉత్సవమండలి ప్రతినిధులు ఘనంగా స్వాగతం పలికి సన్మానించారు.
ఈ సందర్భంగా ప్రకాశ్గౌడ్ మాట్లాడుతూ.. తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచిన బోనాలకు ప్రత్యేక గుర్తింపు తెచ్చిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుందన్నారు. అమ్మవారు కరుణించి తప్పక కరోనా మహమ్మారినుంచి విముక్తి కలిగించి ఆయురారోగ్యాలను ప్రసాదిస్తుందని ఆకాంక్షించారు. భక్తులు తెల్లవారుజాము నుంచి ఆయా కాలనీల గ్రామదేవతల ఆలయాలను దర్శించుకునేందుకు బారులు తీరారు. మధురాగనర్, పోచమ్మబస్తీ, ప్రకాశ్నగర్, రాళ్లగూడ, ఆదర్శనగర్, ఆర్బీ నగర్, సిద్దంతి, వీకర్సెక్షన్ కాలనీ, జెండాచౌరస్తా, యాదవబస్తీ, కుమ్మరి బస్తీతో పాటు పలు కాలనీల్లో బోనాల ఉత్సవాలతో సర్వత్రా ఆద్యాత్మిక శోభ వెల్లివిరిసింది. పోలీసుశాఖ పటిష్టబందోబస్తు మధ్య బోనాల ఉత్సవాలు ప్రశాంతంగా జరిగాయి.
మైలార్దేవ్పల్లి,జూలై 25: మైలార్దేవ్పల్లి డివిజన్ పరిధిలోని లక్ష్మీగూడ, దుర్గానగర్, బృందావన్ కాలనీలో బోనాల పండుగను ప్రజలు ఘనంగా జరుపుకొన్నారు. గత సంవత్సరంలో బోనాల పండుగను నామ మాత్రంగా నిర్వహించారు. ఈ సంవత్సరం కరోనా వ్యాప్తి తగ్గడంతో మహిళలు బోనాలను నెత్తిన పెట్టుకోని పోతరాజులతో కలిసి అమ్మవారికి సమర్పించారు. బస్తీల్లో పోతరాజుల వీరాంగం, శివ సత్తుల పూనకాలతో వీధుల్లో పండుగ వాతావరణం నెలకొన్నది. ఉదయం నుంచి భక్తులు అమ్మవారికి బోనాలు సమర్పించారు. పోచమ్మ ఆలయాల్లో భక్తులు సందడిగా కనిపించారు. బాబుల్రెడ్డినగర్లో వచ్చేవారం నిర్వహించే బోనాల పండుగకు ఆదివారం అమ్మవారి ఘటం బస్తీల్లో ఉన్న అన్ని గల్లీల్లో ఉరేగింపుగా తీసుకువచ్చారు.
శంషాబాద్ రూరల్, జూలై 25 : నర్కూడలో 1,2 తేదీల్లో బోనాల ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు సర్పంచ్ సునిగంటి సిద్ధులు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆషాఢమాసంలో నిర్వహించే బోనాల ఉత్సవాలను ఆగస్టు ఒకటవ తేదీ నుంచి రెండవ తేదీ వరకు నిర్వహించాలని గ్రామసభలో నిర్ణయించి అందుకు సంబంధించిన ఏర్పాట్లును పరిశీలించిన్నట్లు వివరించారు. మైసమ్మ, పోచమ్మ, ఎల్లమ్మ బోనాలు నిర్వహించాలని గ్రామస్తులకు సూచించారు. బోనాల ఉత్సవాల కోసం భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేస్తామని చెప్పారు. కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి సునీత, ఉప సర్పంచ్ గడ్డం శేఖర్యాదవ్, వార్డు సభ్యులు మహేశ్, యాదగిరి, కుమార్గౌడ్, బుక్క ఇందిర, తదితరులు పాల్గొన్నారు.