సిటీ బ్యూరో, జూలై 9 (నమస్తే తెలంగాణ) : తెలంగాణలో సంప్రదాయబద్ధంగా నిర్వహించే ఆషాఢ బోనాల నిర్వహణకు జోరుగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ప్రజలందరూ సంతోషంగా, ఆరోగ్యంగా ఉండాలని, వాతావరణంలో మార్పుల కారణంగా అనారోగ్యం పాలు కాకుండా చల్లని చూపు చూడాలని కోరుతూ అమ్మవారికి ఆషాఢ మాసంలో బోనాలు సమర్పిస్తుంటారు. ఈ నెల 11న ప్రారంభమై ఆగస్టు 8వరకు కొనసాగే ఈ బోనాల ఉత్సవాలను రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించేందుకు ఆయా కమిటీలు సిద్ధమయ్యాయి. హైదరాబాద్లోని దాదాపు 2500 ఆలయాల్లో బోనాల ఉత్సవాలు జరుగనున్నాయి. 10 దేవాలయాల్లో విశేషంగా బోనాల ఉత్సవాలను జరిపించనున్నారు.
సర్కారు బోనం పేరుతో గోల్కొండ జగదాంబికా ఎల్లమ్మ ఆలయంలో ఈనెల 11న ఆషాఢ బోనాలు ప్రారంభమవుతాయి. ఆ తర్వాత ప్రతి వారం ఒక ప్రాంతంలోని ప్రముఖ ఆలయాల్లో బోనాల ఉత్సవాలు జరుగనున్నాయి. లోయర్ ట్యాంక్బండ్ కనకాల కట్టమైసమ్మ దేవాలయం, బల్కంపేట ఎల్లమ్మ, రేణుక ఎల్లమ్మ దేవాలయంలో బోనాల ఉత్సవాలు చేపట్టనున్నారు. ఈ ఉత్సవాల్లో బోనాలు, ఘటాలు సమర్పించడమే కాకుండా ఊరేగింపులు, పోతురాజుల విన్యాసాలు చేయనున్నారు. బల్కంపేటలో ఆషాఢ బోనాలతోపాటు అమ్మవారి కల్యాణ ఉత్సవాలు కూడా వైభవంగా చేపట్టనున్నారు. పాత బస్తీలోని లాల్దర్వాజ సింహ వాహిని మహంకాళి అమ్మవారి దేవాలయం, జూబ్లీహిల్స్ పెద్దమ్మ ఆలయం, చార్మినార్ భాగ్యలక్ష్మి దేవాలయం, హరిబౌలిలోని అక్కన్న మాదన్న మహంకాళి ఆలయంలో బోనాల ఉత్సవాలు ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
మీర్ ఆలం మండి మహంకాళి ఆలయం, కార్వాన్లోని దర్బార్ మైసమ్మ ఆలయంతో పాటు విశేషంగా చెప్పుకునే లష్కర్ బోనాల ఉత్సవాలను సికింద్రాబాద్ ఉజ్జయిని అమ్మవారి ఆలయంలో నిర్వహించనున్నారు. లష్కర్ బోనాలు ఉజ్జయిని ఆలయంలో ఈనెల 25, 26న చేపట్టనున్నారు. కాగా, ఏడు దేవాలయాల్లో బంగారు బోనాలను సమర్పించనున్నారు. బోనాల ఉత్సవాలు జరిగే ప్రాంతాల్లో రోడ్ల మరమ్మతులు, శానిటేషన్ సమస్యలను పరిష్కరిస్తూ దేవాలయాల వద్ద లైటింగ్ వంటి సౌకర్యాలు, ఇతర ఏర్పాట్లు చేశారు. నగర వాసులే కాకుండా ఇతర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు తగిన సౌకర్యాలు కల్పిస్తున్నారు. కరోనా వ్యాప్తి జరుగకుండా భక్తులు మాస్కులు ధరించడం, భౌతిక దూరం పాటించేలా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు.