సిటీబ్యూరో, జూలై 4 (నమస్తే తెలంగాణ): తెలంగాణ ప్రాంతానికే ప్రత్యేకమైన ఆషాడ బోనాలు ఈ నెల 11 నుంచి ప్రారంభం కానున్నాయి. నగరంలోని పలు ఆలయాల్లో వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ఉత్సవ కమిటీలు ప్రత్యేక దృష్టి పెట్టాయి. జంట నగరాల్లో బోనాల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా రూ.15 కోట్లు మంజూరు చేసిన విషయం తెలిసిందే. ఈ నిధులతో ఉత్సవాలు జరిగే ప్రాంతాల్లో రోడ్ల మరమ్మతులు, శానిటేషన్, దేవాలయాల వద్ద లైటింగ్, ఇతర మౌలిక సదుపాయాలను కల్పించే పనిలో అధికారులు పడ్డారు. అంతేకాక తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించేలా వివిధ వేషధారణలతో కళాకారుల ప్రదర్శనలు, త్రీడీ మ్యాపింగ్ లాంటివి నగర కూడళ్లలో ఏర్పాటు చేయనున్నారు. మరోవైపు కరోనా నేపథ్యంలో భక్తులు భౌతిక దూరం పాటించి దైవ దర్శనం చేసుకునేలా అధికారులు అన్ని చర్యలు చేపట్టనున్నారు.