ఘట్కేసర్ రూరల్, డిసెంబర్ 30 : కాయ కష్టం చేసి పైసా పైసా కూడా బెట్టి పుస్తెలమ్మి గూడు కట్టుకున్నం. ఇంటిని కూల్చొద్దని తాసీల్దార్ కాళ్లమీద పడి వేడుకున్నా.. అధికారులు వినలేదు. కాచవానిసింగారం గ్రామానికి చెందిన బోడ పోచమ్మ, శంకరయ్య దంపతులు. వారికి నలుగురు కూతుర్లు. ఉప్పరి పనికి వెళ్లి పోషించుకుంటున్నానని, భర్త పశువులు మేపేందుకు జీతం ఉన్నాడని అధికారులకు చెప్పింది. చేసిన కష్టం రెండు పూటలకే సరిపోతలేదు. అప్పులు చేసి నిర్మించుకున్న ఇంటిని కూల్చొద్దంటూ అధికారులను బతిమాలుకున్నారు.
కూల్చివేతలు తప్పవని అధికారులు చెప్పడంతో ఇంట్లోకి వెళ్లి తలుపులు వేసుకుని బోడ శంకరయ్య ఆత్మహత్యకు యత్నించాడు. దీంతో అధికారులు వెనుదిరిగారు. ఈ ఘటన ఈ నెల 22న మండల పరిధిలోని కాచవానిసింగారం గ్రామంలో జరిగింది. గ్రామానికి చెందిన బోడ పోచమ్మ, శంకరయ్య దంపతులు గ్రామ పరిధిలో ఉన్న ప్రభుత్వ స్థలంలో ఇటీవల చిన్న పాటి రేకుల గదిని నిర్మించుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న అధికారులు ఇంటిని కూల్చేందుకు జేసీబీలతో వచ్చారు. దీంతో పోచమ్మ, శంకరయ్య దంపతులు ఇంటిని కూల్చొద్దని తాసీల్దార్ కృష్ణను వేడుకున్నారు. ఆత్మహత్యకు యత్నించడంతో అధికారులు వెళ్లిపోయారు. స్థానికంగా ఉన్న కటికే నర్సింహ, మహేశ్తో పాటు మరో నాలుగు ఇండ్లను నేలమట్టం చేశారు.
ప్రభుత్వ భూములను ఆక్రమించి కబ్జా చేస్తే చర్యలు తీసుకుంటామని ఘట్కేసర్ తాసీల్దార్ కృష్ణ తెలిపారు. ముందస్తు నోటీసులు జారీ చేసినా వినకపోవడంతో కూల్చివేతలు జరిపినట్లు తెలిపారు. కాచవానిసింగారం పంచాయతీ పరిధిలోని ప్రభుత్వ భూమి సర్వే నంబర్ 66లో కూల్చివేతలు జరిపామని, ఓ మహిళా వేడుకోవడంతో ఆమెకు సమయం ఇచ్చామని పేర్కొన్నారు. ఎవరూ కబ్జా చేసిన ఊరుకొనే ప్రసక్తే లేదని చెప్పారు.