కొండాపూర్, సెప్టెంబర్ 5 : అత్యవసర పరిస్థితుల్లో రోగుల ప్రాణాలను కాపాడేందుకు రక్త నిల్వలు తప్పనిసరని తెలంగాణ హోంశాఖ కార్యదర్శి ఎం.చంపాలాల్ అన్నారు. ఆదివారం వీ లవ్ యూ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రక్త దాన శిబిరానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కొవిడ్ ప్రభావంతో రక్త నిల్వలు పూర్తిగా తగ్గిపోయాయని, ప్రమాదాల్లో ఉన్న వారి ప్రాణాలను కాపాడేందుకు రక్త నిల్వల సేకరణ తప్పనిసరన్నారు. ఆరోగ్యవంతమైన వ్యక్తులు తప్పనిసరిగా రక్తాన్ని దానం చేయాల్సిందిగా కోరారు. ప్రజా ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని రక్త సేకరణకు పాల్పడిన వీ లవ్ యూ ఫౌండేషన్ను అభినందించారు. రక్త దాన శిబిరంలో 300 మందికి పైగా పాల్గొని రక్తాన్ని ఇచ్చినట్లు వీ లవ్ యూ ఫౌండేషన్ ప్రతినిధులు తెలిపారు. ఈ కార్యక్రమంలో సైబరాబాద్ ట్రాఫిక్ డిప్యూటీ కమిషనర్ ఎస్ఎం విజయ్ కుమార్, కొండాపూర్ జిల్లా దవాఖాన సూపరింటెండెంట్ వరదా చారి, సీనియర్ గైనకాలజీ వైద్యులు కళావతి తదితరులు పాల్గొన్నారు.