సిటీబ్యూరో, ఫిబ్రవరి 28 (నమస్తే తెలంగాణ) : “మేం ఫెడెక్స్ ఇంటర్నేషనల్ కొరియర్ సంస్థ నుంచి మాట్లాడుతున్నాం.. మీ పేరు, ఫోన్ నంబర్తో ముంబై నుంచి తైవాన్కు ఒక కవర్లో డ్రగ్స్ స్మగ్లింగ్ అవుతూ పట్టుబడ్డాయి.. మీపై విచారణ జరుగుతున్నది. కస్టమ్స్.. సీబీఐ కేసులను ఎదుర్కోవాలి” అంటూ బెదిరిస్తూ సైబర్నేరగాళ్లు అమాయకులను దోచేస్తున్నారు. సైబర్నేరగాళ్లు కొత్త పంథాలో చేస్తున్న ఈ సైబర్ దోపిడీలో ఎక్కువగా మహిళా సాఫ్ట్వేర్ ఉద్యోగులనే టార్గెట్ చేస్తున్నారు. ఇటీవల ఓ సాప్ట్వేర్ ఉద్యోగినికి ఫోన్ చేసి తాము కస్టమ్స్ నుంచి మాట్లాడుతున్నామంటూ ఫోన్ చేశారు. మీ పేరుతో ఫెడెక్స్ కొరియర్లో ఓ పార్సిల్ ముంబై నుంచి తైవాన్కు వెళ్తుందని, దాన్ని పరిశీలిస్తే డ్రగ్స్ ఉన్నాయి. మీపై విచారణ జరుగుతుందంటూ మాట్లాడారు. ఆ తరువాత మరొకరు ఫోన్ చేసి మీ బ్యాంకు ఆర్థిక లావాదేవీలు పరిశీలించాలని అన్ని వివరాలు పంపించండి అంటూ ఫోన్ చేస్తూ, ఈ కాల్ సీబీఐ ఆఫీస్కు ట్రాన్స్ఫర్ చేస్తున్నాం వారితో మాట్లాడండి అంటూ భయపెట్టారు. ఇంతలో మరొకరు ఫోన్ చేసి ఇవన్నీ సెటిల్ చేసుకోవడానికి ఫలాన ఖాతాలో డబ్బు డిపాజిట్ చేయండంటూ సూచించారు. దీంతో చేసేది లేక ఆ ఉద్యోగినిచే మూడు దఫాలుగా రూ.4.30 లక్షలు డిపాజిట్ చేయించుకున్నారు. ఇంకా బ్లాక్మెయిల్ చేస్తుండడంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని ఏసీసీ కేవీఎం ప్రసాద్ తెలిపారు.