సిటీబ్యూరో, జూన్ 17(నమస్తే తెలంగాణ): బ్లాక్ ఫంగస్ చికిత్సకు ఉపయోగించే అంపొటెరిసిన్ బి ఇంజక్షన్లను బ్లాక్లో విక్రయిస్తున్న రెండు ముఠాలను వెస్ట్జోన్ టాస్క్ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి 28 ఇంజక్షన్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలను సీపీ అంజనీకుమార్ గురువారం కమిషనరేట్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వెల్లడించారు. కొత్తపేట మోహన్నగర్లోని ప్రజయ్ నివాస్లో నివాసముండే బాలస్వామి ఆపరేషన్ థియేటర్లో టెక్నీషియన్గా పనిచేస్తున్నాడు. మెడికల్ ఏజెన్సీలో పనిచేసే మహ్మద్ అబ్దుల్ ఖదీర్, బోడుప్పల్కు చెందిన బి.రంజిత్ వ్యాపారి, అమేజాన్ ద్వారా వస్తువులు విక్రయిస్తుంటాడు. జుబ్లీహిల్స్కు చెందిన అన్వేష్కుమార్రెడ్డి సుమా ఎంటర్ప్రైజెస్ పేరుతో మెడికల్ డిస్ట్రిబ్యూటర్గా వ్యాపారం చేస్తున్నాడు. ఈ నలుగురు కలిసి వివిధ ప్రాంతాల నుంచి ఇంజక్షన్లు సమకూర్చుకొని వాటిని ఒక్కొక్కటి రూ. 35 వేలకు విక్రయించేందుకు ప్లాన్ చేశారు. ఇందులో భాగంగా గురువారం జుబ్లీహిల్స్లోని అన్వేష్కుమార్ డిస్ట్రిబ్యూషన్ సంస్థ సుమా ఎంటర్ప్రైజెస్ వద్ద ఇంజక్షన్లు అవసరమైన వారికి విక్రయించేందుకు ప్రయత్నించారు. సమాచారం అందుకున్న వెస్ట్జోన్ టాస్క్ఫోర్స్ ఇన్స్పెక్టర్ రాజేష్ బృందం నలుగురిని అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి 15 ఇంజక్షన్లను స్వాధీనం చేసుకున్నారు.
సనత్నగర్లోని ఎంఎస్ఎన్ ల్యాబ్స్ తెలంగాణ స్టేట్ సేల్స్ మేనేజర్గా పనిచేస్తున్న జి.శ్రీకాంత్, అదే సంస్థకు మెడికల్ రిప్రంజెంటేటివ్ అయిన శషికుమార్, బ్రిటన్ ఫార్మషూటికల్స్లో మెడికల్ రిప్రంజెంటేటివ్గా పనిచేస్తున్న నిరంజన్, రియల్ ఎస్టేట్ వ్యాపారి వెంకన్న సురేశ్, కెమెరా టెక్నీషియన్ మహ్మద్ అలీముద్దీన్లు గ్యాంగ్గా ఏర్పడ్డారు. బ్లాక్ ఫంగస్ ఇంజక్షన్లకు మార్కెట్లో డిమాండ్ ఉండటంతో బ్లాక్లో విక్రయించాలని ప్లాన్ చేశారు. గుంటూరుకు చెందిన వినోద్ అనే వ్యక్తిని కూడా గ్యాంగ్లో కలుపుకున్నారు. రూ.7400కు ఇంజక్షన్లను తెచ్చి వాటిని రూ.35 వేల నుంచి రూ. 50 వేలకు విక్రయించేందుకు ప్లాన్ చేశారు. ఇందులో భాగంగా బల్కంపేట ఎల్లమ్మ ఆలయం సమీపంలో ఇంజక్షన్లను విక్రయించేందుకు ప్రయత్నిస్తున్నారనే సమాచారంతో టాస్క్ఫోర్స్ పోలీసులు దాడి చేసి ఐదుగురిని అరెస్ట్ చేసి, వారి వద్ద నుంచి 13 ఇంజక్షన్లను స్వాధీనం చేసుకున్నారు. ఇందులో వినోద్ పరారీలో ఉన్నాడు. ఈ రెండు గ్యాంగ్లకు సంబంధించిన కేసుల తదుపరి విచారణ ఆయా స్థానిక పోలీసులకు అప్పగించారు. ఈ సమావేశంలో టాస్క్ఫోర్స్ డీసీపీ రాధాకిషన్రావు తదితర సిబ్బంది పాల్గొన్నారు.
బ్లాక్ ఫంగస్ చికిత్సలో ఉపయోగించే ఎంపోటెరిసిన్ -బి ఇంజక్షను బ్లాక్లో విక్రయించే ముఠాలు సోషల్మీడియా ద్వారానే తమ వ్యాపారాన్ని సాగిస్తున్నారు. తాజాగా హైదరాబాద్ వెస్ట్జోన్ పోలీసులకు చిక్కిన ఒక రెండు ముఠాలలో ఒక ముఠా సోషల్మీడియా ద్వారానే తమ బ్లాక్ దందాను సాగించింది. దీనికి గుంటూర్కు చెందిన వినోద్ సూత్రధారిగా పోలీసులు పేర్కొంటున్నారు. ఫేస్బుక్, వాట్సాప్లో వచ్చే మేసేజ్లతో సోషల్మీడియాలో వినోద్ ఒక ఫ్లాట్ ఫామ్ ఏర్పాటు చేసుకున్నాడు. అందులో దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన వారు సభ్యులుగా ఉంటూ తమ వద్ద బ్లాక్ ఫంగస్ ఇంజక్షన్లు ఉన్నాయని కొందరు.. తమకు అవసరమంటూ మరికొందరు సమాచారాన్ని షేర్ చేసుకుంటారు. ఇలాంటి సమాచారంతో ఇంజక్షన్లను విక్రయించడంలో వినోద్ అనుభవం సంపాదించి అందరినీ సమన్వయం చేసుకుంటూ కమిషన్ తీసుకుంటున్నాడు. ఇదే పద్ధతిలో కరీంనగర్కు చెందిన మహ్మద్ అలీముద్దీన్ బంధువుకు బ్లాక్ ఫంగస్ లక్షణాలుండటంతో ఆమెను దవాఖానలో చేర్పించారు. వెంటనే అంపోటెరిసిన్ బి ఇంజక్షన్లను సమకూర్చారు. పరీక్షల అనంతరం ఆమెకు ఆ వ్యాధి సోకలేదని తేలింది. దీంతో తన వద్ద ఉన్న ఇంజెక్షన్లను విక్రయించాలని అలీముద్దీన్ నిర్ణయించుకున్నాడు. దీనికి సహకరించాలని బోడుప్పల్కు చెందిన మెడికల్ రిప్రజెంటేటివ్ నిరంజన్ను కోరడంతో వినోద్ను సంప్రదించి విక్రయించే ప్రయత్నం చేశారు. అదే విధంగా జుబ్లీహిల్స్ ఘటనలోను పేషెంట్కు సంబంధించిన వారి నుంచే 10 ఇంజక్షన్లను కొని వాటిని బ్లాక్లో విక్రయించేందుకు ఈ ముఠా ప్రయత్నించింది.