సికింద్రాబాద్, జనవరి 2: కాషాయ నేతలు గూండాయిజానికి పాల్పడుతున్నా రు. కంటోన్మెంట్ ప్రాంతం లో బీజేపీ నాయకులు బరితెగిస్తున్నారు. ప్రశ్నిస్తున్న నేతలపై దాడులకు దిగుతున్నారు.కంటోన్మెంట్లో గతంలో సగం పనులు పూర్తి చేసిన వాటికి తాజాగా కాషాయపు నేతలు శిలాఫలకాలు ఏర్పాటు చేస్తూ ఒంటెద్దు పోకడలకు నాం ది పలుకుతున్నారు.అర్ధరాత్రి దొంగ ల్లా శిలాఫలకాలు రోడ్డుకు అడ్డంగా ఏర్పాటు చేసి రోడ్లు వేస్తున్నామని కొత్త నాటకాలకు తెరతీస్తున్నారు. బోర్డు అనుమతి లేకుండానే ఇష్టానుసారంగా శిలాఫలకాలు ఏర్పాటు చేస్తూ ప్రారంభానికి ప్రొటోకాల్ పాటించడం లేదు. అడిగితే గుండాయిజానికి పాల్పడుతూ టీఆర్ఎస్ శ్రేణులపై దాడులకు దిగడమే కాకుండా ప్రశాంతంగా ఉన్న ఒకటో వార్డులో ఉద్రిక్త పరిస్థితులకు కారణమయ్యారు. గతేడాది అక్టోబర్లో ఒకటో వార్డులోని చిన్నతోకట్ట నుంచి సెవన్ టెంపు ల్ మీదుగా కంసారి బజార్ చాయ్ అడ్డా వరకు రోడ్డు మరమ్మతులకు సంబంధించి సుమారు రూ.72లక్షలకు కంటోన్మెంట్ బోర్డు నిధులను కేటాయిస్తూ మంజూరు చేసింది. దీంట్లో భాగంగా మొదటగా చిన్నతోకట్ట, సెవన్ టెంపుల్ రోడ్డు పనులు పూర్తి చేశారు. అనంతరం కంసారి బజార్లోని చాయ్ అడ్డా నుంచి వేయాల్సిన రోడ్డుకు సంబంధించి నూతన నీటి కనెక్షన్ల ఏర్పాటు ప్రక్రియ ఉన్నందున జాప్యం ఏర్పడింది.
ఇటీవల కాలంలోనే నూతన నీటి కనెక్షన్ల ప్రక్రియ పూర్తి కావడంతో పాటు బోర్డులో నిధులు దండిగా ఉన్న క్రమంలో చాయ్ అడ్డా నుంచి రోడ్డు వేసేందుకు కాంట్రాక్టర్ ముందుకు వచ్చాడు. అయితే ప్రస్తుత నాటినేటెడ్ బోర్డు సభ్యుడిగా ఉన్న రామకృష్ణ రాత్రికి రాత్రే తన అనుచరులతో రోడ్డు ప్రారంభోత్సవానికి సంబంధించి శిలాఫలకాన్ని ఏర్పా టు చేయించారు. దీని కోసం చాయ్ అడ్డా చౌరస్తాలో శనివారం రాత్రి శిలాఫలకాన్ని ఏర్పాటు రంగం సిద్ధం చేయ గా, టీఆర్ఎస్ సీనియర్ నాయకుడు, కంటోన్మెంట్ బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జక్కుల మహేశ్వర్రెడ్డి శిలాఫలకం ఏర్పాటుపై ఆగ్రహం వ్యక్త చేస్తూ నిలుపుదల చేశారు. వెంటనే శిలాఫలకాన్ని తొలగించాలని డిమాండ్ చేస్తూ టీఆర్ఎస్ శ్రేణులు నినాదాలు చేశారు. వీరికి పోటీగా కాషాయం నేతలు బానుకా మల్లికార్జున్ ఆధ్వర్యంలో నినాదాలు చేయడంతో పాటు టీఆర్ఎస్ నాయకులతో వాగ్వాదానికి దిగారు. ఒకానొక సందర్భంలో టీఆర్ఎస్ నాయకుడు జక్కులతో పాటు కార్యకర్తలపై బీజేపీకి చెంది న గుండాలు దాడికి పాల్పడ్డారు. రెచ్చగొట్టే వ్యాఖ్యలతో దుమారం తీవ్రరూపం దాల్చడంతో పోలీసులు చేరుకుని ఇరు పార్టీలకు చెందిన నేతలను చెదరగొట్టారు. కనీసం ప్రొటోకాల్ పాటించకుండా కంటోన్మెంట్ బోర్డు అనుమతి లేకుండా పనులను చేయడమే గాకుండా తమ హయాంలో మంజూరైన పనులను వారి పేర్లతో శిలాఫలకాలు ఏర్పాటు చేయడం ఏంటని ప్రశ్నించారు. ఎట్టి పరిస్థితుల్లో శిలాఫలకాన్ని ఏర్పాటు చేయనివ్వబోమని తెగేసి చెబుతున్నారు. స్థానిక ఎమ్మెల్యే సాయన్న, కంటోన్మెంట్ సీఈవో అజిత్ రెడ్డి లేకుండా ఏ విధంగా ప్రారంభిస్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
బీజేపీ నేతలపై స్టేషన్లో ఫిర్యాదు
బీజేపీ నేతల గుండాయిజంపై బోయిన్పల్లి పోలీసులకు వార్డు టీఆర్ఎస్ జనరల్ సెక్రటరీ విజయ్ ఫిర్యాదు చేశారు. తమ నాయకులపై అనుచితంగా మాట్లాడుతూ దాడికి పాల్పడ్డారని, బీజేపీ నేత రామకృష్ణ, మల్లికార్జున్ పై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. గతంలో మంజూరైన పనులకు తామే రోడ్లు వేస్తున్నట్లు జనం బీజేపీ నేతలు అబద్దాలు ప్రచారం చేస్తూ మభ్యపెడుతున్నారని, అలాంటి వారిపై చర్యలు తక్షణమే తీసుకోవాలని ఫిర్యాదు చేసినట్లు చెప్పారు.
కదిలిన టీఆర్ఎస్ దళం
బీజేపీ నేతల గుండాయిజంపై తెలుసుకున్న కంటోన్మెంట్కు చెందిన పలు వార్డుల టీఆర్ఎస్ శ్రేణుల బోయిన్పల్లికి కదిలారు. ఎనిమిదో వార్డుకు చెందిన బోర్డు మాజీ సభ్యుడు లోక్నాథ్ నేతృత్వంలో పార్టీకి చెందిన కార్యకర్తలు పెద్ద ఎత్తున సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అదేవిధంగా ఆరో వార్డుకు చెందిన పాండుయాదవ్ ఆధ్వర్యంలో కదిలిన శ్రేణులు బీజేపీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
డ్రామాలు ఆపకపోతే వార్డుల్లో తిరగనివ్వం
ఆరు నెలల పాటు పదవి కోసం ఢిల్లీకి చక్కర్లు కొట్టిన నేత నేడు జనాలను ఉద్దరిస్తున్నట్లు పోజులు కొడుతుండటం దారుణం. గతంలో వచ్చిన వర్క్స్ ఆర్డర్స్తో ఇప్పుడు పనులు తామే చేయిస్తున్నట్లు చెప్పుకోవడం సిగ్గుచేటు. అబద్దాలు ఆడుతూ డ్రామాలు మొదలుపెట్టాడని, డ్రామాకృష్ణగా మారి రోడ్లపై పడ్డాడు. కేంద్రం నుంచి ఒక్క రూపాయి తేలేని దద్దమ్మగా మిగిలిపోయాడు. పూటకో పార్టీ మారుతూ, పబ్బం గడుపుకునే రామకృష్ణ, నేతలను ఉసిగొల్పి టీఆర్ఎస్ నేతలపై దాడులకు దిగడం హేయమైన చర్య.అబద్దాలు ప్రచారం చేస్తే ప్రజలే తగిన గుణపాఠం చెబుతారు.
– జక్కుల మహేశ్వర్రెడ్డి, మాజీ ఉపాధ్యక్షుడు, కంటోన్మెంట్ బోర్డు.