ఎల్బీనగర్, సెప్టెంబర్ 06 : తప్పు చేసిన బీజేపీ కార్పొరేటర్ బద్దం ప్రేమ్ మహేశ్వర్రెడ్డిని సస్పెండ్ చేసి పదవి నుంచి తొలగించాలని ఎల్బీనగర్ నియోజకవర్గం టీఆర్ఎస్ కార్పొరేటర్, మాజీ కార్పొరేటర్లు డిమాండ్ చేశారు. మంగళవారం గడ్డిఅన్నారం డివిజన్ శారదానగర్ కమ్యూనిటీ హాల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో టీఆర్ఎస్ మాజీ కార్పొరేటర్లు కొప్పుల విఠల్రెడ్డి, జిట్టా రాజశేఖర్రెడ్డి, భవానీప్రవీణ్, జీవీ సాగర్రెడ్డి, సామ తిరుమల్రెడ్డి, చెరుకు సంగీత, రమావత్ పద్మానాయక్, హస్తినాపురం కార్పొరేటర్ సుజాతానాయక్ మాట్లాడారు. దమ్ముంటే బీజేపీ నాయకులు కర్మన్ఘాట్ హనుమాన్ దేవాలయానికి రావాలని, ఎవరి అక్రమాలు ఏమిటో తేల్చుకుందామని వారు సవాల్ విసిరారు.
యువకుడు సుబ్రహ్మణ్యం కిడ్నాప్ కేసులో ప్రధాన పాత్ర వహించిన కార్పొరేటర్ బద్దం ప్రేమ్మహేశ్వర్రెడ్డిని వెనకేసుకుని వచ్చిన బీజేపీ అర్బన్ అధ్యక్షుడు సామ రంగారెడ్డి, కార్పొరేటర్లు వంగా మధుసూదన్రెడ్డి తదితరులు ఎమ్మెల్యే సుధీర్రెడ్డిపై ఆరోపణలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. బీజేపీ నేత సామ రంగారెడ్డి, కార్పొరేటర్ వంగా మధుసూదన్రెడ్డి భూకబ్జాలు అన్నీ ఇన్నీ కావని అన్నారు. తప్పు చేసిన కార్పొరేటర్ బద్దం ప్రేమ్ మహేశ్వర్రెడ్డిని, మద్దతు ఇస్తున్న సామ రంగారెడ్డిని బీజేపీ నుంచి సస్పెండ్ చేయాలని టీఆర్ఎస్ నాయకులు డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే రాజా సింగ్కు ఒక న్యాయం, కార్పొరేటర్, సామ రంగారెడ్డిలకు మరో న్యాయమా అంటూ వారు ప్రశ్నించారు. గడ్డిఅన్నారం కార్పొరేటర్ బద్దం ప్రేమ్ మహేశ్వర్రెడ్డి సొంత పార్టీ నాయకులు లంకా లక్ష్మీనారాయణ కుమారుడు సుబ్రహ్మణ్యంను కిడ్నాప్ చేసి చింతపల్లిలో బంధించి నరబలి చేసేందుకు సిద్ధపడటం హేయమని అన్నారు. ఈ కార్యక్రమంలో గడ్డిఅన్నారం డివిజన్ టీఆర్ఎస్ అధ్యక్షుడు జక్కల శ్రీశైలం యాదవ్, నాయకులు రమేశ్ ముదిరాజ్, రమణారెడ్డి, పడిదం కృష్ణారెడ్డి, విక్కీ, మహిళా నాయకురాళ్లు శైలజ, విజయలక్ష్మీ తదితరులు పాల్గొన్నారు.