కవాడిగూడ ( హైదరాబాద్ ) : మణిపూర్ అల్లర్ల వెనుక బీజేపీ కుట్ర ఉన్నదని సీపీఐ, సీపీఐ(ఎం) నాయకులు ఆరోపించారు. ఈ దురదృష్ట ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi ) నోరు విప్పకపోవడం అత్యంత దారుణమని అన్నారు. మణిపూర్ ( Manipur ) అల్లర్లను అరికట్టండి, ప్రజల ప్రాణాలను కాపాడండి, మణిపూర్ బీజేపీ సీఎం రాజీనామా ( CM Resign ) చేయాలని డిమాండ్ చేస్తూ మంగళవారం లోయర్ ట్యాంక్బండ్లోని అంబేద్కర్ విగ్రహం వద్ద సీపీఐ, సీసీఐ(ఎం) ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు.
నల్ల జెండాలను చేతబూని బీజేపీకి హటావో, దేశ్కు బచావో, ఆర్ఎస్ఎస్ బావజాలానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా సీపీఐ (CPI ) జాతీయ కార్యదర్శి డాక్టర్ కే. నారాయణ, సీపీఐ(ఎం) (CPM ) తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు, మాజీ ఎంపీ అజీజ్ పాషాలు మాట్లాడారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ పెద్దల ప్రోత్సాహంతోనే మణిపూర్ బీజేపీ సీఎం అల్లర్లను ప్రోత్సహిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
మత ఘర్షణలతో లబ్ధి పొందాలని కుట్ర చేస్తున్న బీజేపీని కేంద్రం నుంచి గద్దె దింపాలని, అందుకు ప్రజాస్వామ్య, లౌకికవాద శక్తులన్నీ ఏకమై ముందుకు రావాలని పిలుపునిచ్చారు. మణిపూర్ చైన్ ద్వారా ఆయుధాలతో టెర్రరిస్టులు దేశంలోకి చొరబడుతున్నపటికి కేంద్రం, మణిపూర్ బీజేపీ ప్రభుత్వాలు పట్టించుకోకపోవడం సిగ్గు చేటన్నారు. అల్లర్లను అదుపు చేయాలని ఇప్పటి వరకు ప్రధాని మోదీ కోరలేదన్నారు.
మణిపూర్ భూగర్భ సంపదను కార్పొరేట్ శక్తులకు అంటగట్టారని, అలాగే మణిపూర్లో ఉన్న 54 ఎకరాల భూమని అదానీకి అప్పగించారని, అందుకే మణిపూర్లో ఘటనను బీజేపీ ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని విమర్శించారు. ఈ కార్యక్రమంలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు ఈటీ నర్సింహ, హైదరాబాద్ జిల్లా కార్యదర్శి ఎస్. ఛాయాదేవి, వీఎస్ బోస్, ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి బి. వెంకటేశ్, మహిళా సమాఖ్య రాష్ట్ర అధ్యక్షురాలు ఉస్తేల సృజన తదితరులు పాల్గొన్నారు.