బస్తీల లోని ప్రజలు పేదరికంతో సహజీవనం చేయక తప్పని పరిస్థితి. ఇల్లు గడవాలంటే భార్యభర్త ఇద్దరూ పని చేయాల్సిన దుస్థితి. రెక్కాడితే కానీ డొక్కాడని పరిస్థితులలో పిల్లలను ఇంట్లోనే వదిలేసి ఉదయమే పనులకు వెళ్లి, రాత్రయ్యాక ఇంటికొస్తారు. ఇంట్లోని పెద్దమ్మాయి లేదా పెద్దబ్బాయి మిగిలిన పిల్లల ఆలనా పాలనా చూసుకోవాల్సిన పరిస్థితి. ఈ క్రమంలో ఆ పసిమొగ్గలను చుట్టూ ఉండే క్రూర‘మృగాళ్ల’ నుంచి కాపాడేదెవరు.. ?
గంజాయి..గుట్కా.. మద్యం.. మత్తు ఏదైనా కావొచ్చు.. చిన్నగా మొదలై వ్యసనంగా మారుతోంది. పేదరికంతో పెద్దగా చదువుకోక మంచి, చెడు తెలియని విచక్షణ…ఫలితం చిన్న చిన్న విషయాలకే తగాదాలు, గొడవలు. వెంటాడుతున్న ఆర్థిక కష్టాల నుంచి బయటపడేందుకు చిన్న వయసులోనే నేరాల బాట పట్టడం బస్తీల్లో షరా మామూలే. మత్తులో చిత్తవుతున్న యువతరానికి బంగారు భవిష్యత్తు ఉందని చెప్పేదెవరు.. ?
సిటీబ్యూరో, సెప్టెంబర్ 29(నమస్తే తెలంగాణ) : నగరంలో రోజుకు రోజుకు నేరాలు పెరుగుతున్నాయి. చిన్న పిల్లలపై అఘాయిత్యాలు జరుగుతున్నాయి. చిన్న చిన్న గొడవలే ప్రాణాలు తీస్తున్నాయి. ఇలాంటి ఘటనల్లో బాధితులు, నేరచరితుల మూలాలన్నీ బస్తీల్లోనే ఉంటున్నాయి. నేరాలను అదుపు చేయాలంటే ముందు బస్తీలను బాగుచేయాలనే సత్సంకల్పంతో పోలీసులు, భరోసా కేంద్రాలు, షీ టీమ్స్, స్వచ్ఛంద సంస్థలు బస్తీబాట పట్టాయి. బస్తీలు, మురికివాడలలోని పిల్లలు, పెద్దల్లో మంచి, చెడులపై మరింత అవగాహన పెంచుతూ నేరాల కట్టడికి సరికొత్త ప్రణాళికను అమలు చేస్తున్నారు.
స్థానిక పోలీసులు, షీటీమ్స్, భరోసా కేంద్రం సిబ్బంది కలిసి బస్తీలు, మురికివాడలలో అవగాహన కార్యక్రమాలు చేయడం సమయంతో కూడుకున్న పని.ఈ నేపథ్యంలోనే స్వచ్ఛంద సంస్థల సహకారం తీసుకుంటున్నారు. బస్తీలు, మురికివాడలలో వివిధ రకాల సేవలు అందించే సంస్థలను గుర్తించి, వారి సేవలను పోలీసులు ఉపయోగించుకుంటున్నారు. ఇందుకు పలు సంస్థలు స్వచ్ఛందంగానే కలిసొస్తున్నాయి. ఇప్పటికే భరోసా కేంద్రంలో కొన్ని సంస్థలలో పనిచేస్తున్న శిక్షకులతో ఉన్నతాధికారులు సమావేశమై అవగాహన కార్యక్రమాలు ప్రారంభించారు.
మురికివాడలలోని పిల్లలకు విద్యాబుద్ధులు చెప్పడం, ఆరోగ్యంపై అవగాహన కల్పించడం వంటి కార్యక్రమాలపై క్షేత్ర స్థాయిలో వారి సేవలను ఉపయోగించుకుంటున్నారు. ఇటీవల సింగరేణి కాలనీలో జరిగిన ఘటన లాంటివి ఎక్కడ జరగకుండా ఉండేందుకు పిల్లలు, వారి తల్లిదండ్రులు, బంధువులలో మంచి, చెడు అంశాలను వివరిస్తున్నారు. వీటితో పాటు చిన్న చిన్న తగాదాలు, గొడవలు, చెడు అలవాట్లకు బానిసలయ్యే యువత నేరాల బాట పట్టడం వంటి ఘటనలకు కారణాలు విశ్లేషిస్తూ ఉన్నతాధికారులు ఒక నివేదిక తయారు చేశారు. యువతకు ఉపాధి చూపడమే ఉత్తమ మార్గామని పోలీసులు జాబ్ కనెక్ట్ ప్రోగ్రామ్ ద్వారా నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు కల్పిస్తున్నారు.
మహిళలు, పిల్లల భద్రతకు సంబంధించిన అన్ని విషయాలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. వీటితో పాటు ఆయా ప్రాంతాలలో గతంలో నేరాలు చేసిన వారి చిట్టాను తయారు చేస్తారు. కొత్త వారు వచ్చినా, అనుమానితులు కనిపించినా పోలీసులకు సమాచారం ఇవ్వాలని తెలియజేస్తున్నారు. చుట్టుపక్కల ఉన్న వాళ్లెవరు, వాళ్లేమి చేస్తున్నారనే విషయాలు పక్కాగా అందరికీ తెలిసి ఉండేలా అవగాహన కల్పిస్తారు. బస్తీలలోని నాయకులు, సంఘాలను కూడా ఈ కార్యక్రమాలలో భాగస్వాములు చేస్తారు. ఎక్కువగా ఫిర్యాదులు, నేరాలు జరిగే ప్రాంతాలను గుర్తించి వాటి నివారణకు స్థానికుల అభిప్రాయాలను తీసుకుంటారు. శాంతి భద్రతల బాగుండాలంటే ఏమి చేయాలని, నేరాలు చేస్తే ఎలాంటి శిక్షలుంటాయనే విషయాలను కూడా ఈ అవగాహన కార్యక్రమాలలో వివరిస్తున్నారు.
ప్రతి ఠాణా పరిధిలో ఉన్న బస్తీలలో దాదాపు 966 ప్రాంతాలలో అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నాం. ప్రశాంత వాతావారణం, మంచి, చెడుల గూర్చి అవగాహన తీసుకురావడం, పిల్లలు, మహిళల భద్రతకు సంబంధించిన అంశాలపై అవగాహన కల్పిస్తూ నేర నియంత్రణలో ప్రజలను భాగస్వాములు చేస్తున్నాం. ఇప్పటి కే 300 బాలలు, యువతతో ముఖాముఖి కలిసి వివిధ అంశాలపై అవగాహన కల్పించాం. ప్రతి ఠాణా పరిధిలో జరిగే అవగాహన కార్యక్రమాలకు భరోసా, షీ టీమ్స్ నుంచి కౌన్సిలర్లు వెళ్తారు, దానితో పాటు ఆయా ఠాణాల ఎస్హెచ్వోలు, సెక్టార్, అడ్మిన్ ఎస్సైలు, పెట్రోలింగ్ సిబ్బందికి బాధ్యతలు తీసుకుంటారు. – అంజనీకుమార్, హైదరాబాద్ పోలీస్ కమిషనర్