జూబ్లీహిల్స్ : అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా వైద్య సిబ్బందిని ఉత్తమ సేవా పురస్కారాలతో సత్కరించడం పట్ల ఆనందోత్సాహాలు వ్యక్తమవుతున్నాయి. కరోనాకు ఎదురొడ్డి ప్రజల ప్రాణాలను కాపాడడంలో చూపిన మానవత్వానికి ఉత్తమ పురస్కారాలతో సత్కరించడం వారిలో సంతోషాన్ని నింపింది. శ్రీరాంనగర్ క్లస్టర్లో 10 మంది వైద్య సిబ్బందికి ఉత్తమ సేవల అవార్డులు వచ్చాయి.
శ్రీరాంనగర్ క్లస్టర్ అధికారి డాక్టర్ అనురాధ (ఎస్పిహెచ్ఓ), మెడికల్ ఆఫీసర్ డాక్టర్ జువేరియా బేగం (వినాయక్నగర్), పీహెచ్ఎన్ మధులత (షౌకత్నగర్), ఏఎన్ఎంలు నాగవేణి (శ్రీరాంనగర్), దీనమ్మ (వినాయక్నగర్), ఫార్మాసిస్ట్ అనూష (జూబ్లీహిల్స్), ఆశా వర్కర్లు విజయలక్ష్మి (జూబ్లీహిల్స్), సత్యవతి (శ్రీరాంనగర్), సరళమ్మ (వినాయక్నగర్), విజయలక్ష్మి (బంజారాహిల్స్) లకు అవార్డులు దక్కాయి.
మంగళవారం జిల్లా వైద్యశాఖాధికారి కార్యాలయ ప్రాంగణంలో జరిగిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలలో జిల్లా కలెక్టర్ శర్మన్, సిటీ సివిల్ కోర్టు జడ్జి స్వాతి రెడ్డిలు జిల్లా వైద్యశాఖాధికారి డాక్టర్ జె.వెంకటి, ఎస్పిహెచ్ఓ డాక్టర్ అనురాధతో కలిసి అవార్డులు అందజేశారు. బోరబండ యూపీహెచ్సీకి చెందిన ఆశా వర్కర్ నందిని మంత్రి తలసాని శ్రీనివాస్ చేతులమీదుగా అవార్డు అందుకున్నారు.