Crime News | బేగంపేట్, మార్చి 21 : ఇద్దరు అగంతకులు ఓ ఇంట్లో చొరబడి తల్లీకూతుర్లను తుపాకి, కత్తితో బెదిరించి చోరీకి యత్నించిన ఘటన బేగంపేట్ పోలీస్స్టేషన్ పరిధిలోని జైన్నగర్లో కలకలం సృష్టించింది. స్థానికులు, బేగంపేట్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బేగంపేట్ జైన్ నగర్లో ఉంటున్న అమితామెహాల్ ఇంట్లోకి గురువారం రాత్రి సమయంలో ఒకరు హెల్మెట్, మరొకరు టోపీ, మాస్కు ధరించి కత్తి, తుపాకీతో ఇంట్లోకి చొరబడ్డారు.
ఇంట్లో ఉన్న తల్లీకూతుర్లను బెదిరించి దాడి చేసి చోరీకి యత్నించారు. తల్లీకూతుర్లు దుండగులను ఎదిరించి తుపాకీ, కత్తి లాక్కున్నారు. వారితో బీభత్సంగా పోరాడారు. తల్లీకూతుర్ల దాడిని తట్టుకోలేక ఆ ఇద్దరు అగంతకులు అక్కడి నుంచి పారిపోయారు. అయితే పోలీసుల అదుపులో ఓ నిందితుడు ఉన్నట్లు తెలిసింది. నిందితులు తెలిసిన వారా..? లేక బయట నుంచి వచ్చిన దొంగలా..? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.