బేగంపేట్, సెప్టెంబర్ 1 : అక్రమంగా కంట్రీమెడ్ పిస్టల్తో తిరుగుతున్న ఓ వ్యక్తిని బేగంపేట్ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. గురువారం బేగంపేట్ పోలీస్స్టేషన్లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఏసీపీ పృథ్వీధర్రావు, ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ వివరాలు వెల్లడించారు. మచిలీపట్నంకు చెందిన మోహర్ ప్రకాశ్ కాంట్రాక్టర్. బేగంపేట్ శ్యాంలాల్ బిల్డింగ్లోని ఓ అపార్ట్మెంట్లో నివసించేవాడు. 2012 నుంచి 2018 వరకు రోడ్డు కాంట్రాక్ట్ వ్యాపారం చేశాడు.
ఈ క్రమంలో సుమారు రూ.2.84 కోట్ల వరకు అప్పులయ్యాయి. అప్పులు ఇచ్చిన వారి నుంచి ఒత్తిడి అధికం కావడంతో ఆగస్టు 2021లో చెన్నైకి పారిపోయాడు. అయితే అప్పులు ఇచ్చినవారి నుంచి బెదిరింపులు వస్తుండటంతో బీహార్ రాష్ట్రంలో ఓ పిస్టల్, పది బుల్లెట్లు కొనుగోలు చేశాడు. ఇటీవల హైదరాబాద్కు వచ్చి పద్మారావునగర్లోని అతడి మామ ఇంటికి వె ళ్లాడు. అక్కడ అతడి బావమరిది ధీరేంద్రతో గొడవపడి బెదిరించి వెళ్లాడు. మలక్పేట్లోని రాయల్ లాడ్జ్లో బస చేశాడు. 30న బేగంపేట్లో అనుమానాస్పదంగా తిరుగుతుండగా పోలీసులు పట్టుకున్నారు. తనిఖీ చేయగా అతడి వద్ద పిస్టల్, బుల్లెట్లు లభ్యమయ్యాయి. దీంతో అతన్ని అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు.