సిటీబ్యూరో, డిసెంబర్ 7(నమస్తే తెలంగాణ): అద్భుతమైన, రమ్యమైన రాతి ఆకృతులు హైదరాబాద్ సొంతం.. నగరం చుట్టూనే కాకుండా దక్కన్ పీఠభూమిగా పేరొందిన తెలంగాణలో సైతం వినూత్నమైన రాతిగుట్టల వరుసలు తెలంగాణకు కిరీటంలా ఉన్నాయని చరిత్రకారులు చెబుతున్నారు. ముఖ్యంగా హైదరాబాద్ నగరం చుట్టూ పలు ప్రాంతాల్లో వివిధ ఆకారాలతో సహజమైన పురాతన రాతి శిలలు ఆకట్టుకుంటున్నాయి. నగరం చుట్టూ వేల ఏండ్ల నాడే ఏర్పడిన శిలాజ సంపదను పలు సందర్భాల్లో ఆర్కియాలజిస్టులు వెలికితీసిన విషయం తెలిసిందే. ఇక్కడ వెలిసిన రాతి శిలలు హిమాలయాలకంటే పురాతనమైనవిగా ఆర్కియాలజిస్టులతో పాటు చరిత్రకారులు సైతం శాస్త్రీయంగా విశ్లేషించి చెప్పగలిగారు.
పోతపోసినట్టే.. రాతి శిలల ఆకృతులు..
ప్రధానంగా నగరంలోని ఫక్రుద్దీన్ గుట్టపై వేల ఏండ్ల నాటి రాతి శిలలు వందల ఎకరాల్లో పరుచుకొని ఉన్నాయి. అక్కడ అద్భుతమైన రాతి ఆకృతులు సహజంగానే రూపుదిద్దుకున్నాయి. అక్కడి శిలల్లో ఫక్రుద్దీన్ గుట్టకు పశ్చిమాన కూర్మము (తాబేలు), మనిషి పాదాలు, దొంతరాళ్లు (ఒకటిపై మరొకటి పేర్చినట్లు), పీట ఆకారం, మరీ ముఖ్యంగా అక్కడి పరుపు బండపై చిర్రగొనె (గిల్ల దండ) ఆడేందుకు వీలుగా ఉన్న రాతి ఆకారాలు చూపరులను ఆకర్షిస్తున్నాయి. ఆ గుట్టపైనే గుడి ఆకారంలోనూ భారీస్థాయి బండరాళ్లు ఉన్నాయి. అంతేగాకుండా ఖాజాగూడ చెరువులో సైతం రాతిశిలలు పోతపోసినట్టే ఉన్నాయి. ఇక మెహర్ బాబా ధ్యాన మందిరం భక్తులను ఆకట్టుకుంటున్నది. గుహ లాగా ఉన్న ఈ ధ్యాన మందిరంలో కొద్ది క్షణాలు గడిపి ధ్యాన ముద్రలో తరిస్తుంటారు. దీంతో పాటు ఫక్రుద్దీన్ గుట్టపై స్నాన గుండం సైతం అందరినీ ఆకట్టుకునేలా ఉంది. రాతిగుట్టపైనే భారీస్థాయిలో బావిలాగే ఉండటం, ఆ గుండంలో ఎప్పటికీ నీళ్లు ఉండటం కూడా అక్కడి ప్రత్యేకత.
నగర నలుమూలల్లో ఆదిమానవుల ఆవాసాలు
శామీర్పేట పరిధిలోని శ్రీవేంకటేశ్వర గుట్టపై అనేక ఆకారాలతో కూడిన శిలలు ప్రకృతిలో పరవశింపజేసే విధంగా అందరినీ ఆలోచింపజేస్తున్నాయి. వేంకటేశ్వర స్వామి భక్తులు అక్కడి ఆలయానికి వెళ్లినప్పుడు.. గుడి ఆక్రుతిలో ఎత్తైన రాతి గుట్టను సందర్శించిన తర్వాతే వెనుదిరుగుతారని పర్యాటకులు చెబుతున్నారు. కొంగరకలాన్, పెద్ద అంబర్పేట ప్రాంతాల్లో కూడా అనేక గుట్టలు ఔటర్పై వెళ్లే ప్రయాణికులను పలుకరిస్తున్నట్టు అగుపిస్తాయి. నడి నగరంలోని బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, మౌలాలీ, యాప్రాల్ పరిధిలోని నాగమందిర్ టెంపుల్ వెనకాల ఉన్న గుట్టలు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. ప్రధానంగా జూబ్లీహిల్స్లోని బీఎన్ రెడ్డి హిల్స్లోని రాతిశిలల్లో ఇటీవలే 6వేల ఏండ్ల నాటి పనిముట్లు కూడా లభించడం చూస్తే పురాతన కాలంలోనే ఇక్కడి రాతిశిలలు ఆదిమానవులు ఆవాసాలుగా ఏర్పర్చుకొనేందుకు ఉపయోగకరంగా ఉండటం విషేశం.