తెలుగుయూనివర్సిటీ, ఆగస్టు 23 : దేశంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ సామాజిక రిజర్వేషన్లను రద్దు చేయాలని ఢిల్లీలో ఆందోళన చేపట్టడం సిగ్గుచేటని, 80 ఏళ్లుగా దేశాన్ని పందికొక్కుల్లా దోచుకున్న వారు నేడు రిజర్వేషన్ల వ్యతిరేక కృత్రిమ ఉద్యమాన్ని నడిపిస్తున్నారని బీసీ సంఘాల నాయకులు మండిపడ్డారు. ఆదివారం బీసీ భవన్లో నిర్వహించిన సమావేశంలో వారు మాట్లాడుతూ దేశ వ్యాప్తంగా జరిగే జాతి జనగణనలో బీసీ కులగణనను చేపట్టి బీసీ కులాల లెక్కలు దామాషా పద్ధతిన చేపట్టి, బీసీలకు రాజ్యాంగబద్దమైన హక్కులు కల్పించాలని డిమాండ్ చేశారు. బీసీలను తప్పుదారి పట్టించడానికి దేశ వ్యాప్తంగా ఉన్న రిజర్వేషన్ వ్యతిరేకులు గత కొన్ని నెలలుగా ఆన్లైన్ ద్వారా ప్రస్తుతం ఢిల్లీలోని జంతర్మంతర్ వద్ద ఆందోళన చేస్తున్నారని మండిపడ్డారు.
నాటి మండల్ ఉద్యమంలో రిజర్వేషన్లను వ్యతిరేకించిన వారి వారసులే నేడు సామాజిక రిజర్వేషన్లను రద్దు చేయాలని విషం కక్కుతున్నారని చెప్పారు. అలాంటి వారు ముందు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లను రద్దు చేయాలని డిమాండ్ చేయాలని సవాల్ చేశారు. స్వాతంత్రం వచ్చి 80 ఏళ్లు గడుస్తున్నా దేశంలో ఇంకా కుల వివక్షత, సామాజిక అసమానతలు, ఆర్థిక దోపిడీ పోలేదన్నారు. ఈ సమావేశంలో బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్, బీసీ జేఏసీ వర్కింగ్ ఛైర్మన్ గుజ్జ క్రిష్ణ, బీసీ కుల సంఘాల జేఏసీ ఛైర్మన్ కుందారం గణేష్ చారి, బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు కుల్కచర్ల శ్రీనివాస ముదిరాజ్, బీసీ జేఏసీ రాష్ట్ర కో ఛైర్మన్ పిట్ల శ్రీధర్, బీసీ మహిళా సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు బి.మణి మంజరి సాగర్, బీసీ జేఏసీ రాష్ట్ర కన్వీనర్ జాజుల లింగం గౌడ్, బీసీ ఉద్యోగుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తాటిపల్లి పాండు, బీసీ జేఏసీ రాష్ట్ర కన్వీనర్ మడత వెంకట్ గౌడ్, మల్లన్న పాల్గొన్నారు.