అడ్డగుట్ట, డిసెంబర్ 14 : మెట్టుగూడ డివిజన్ పరిధిలో సుమారు రూ. 11 లక్షల వ్యయంతో జరుగుతున్న నాలా పూడికతీత పనులు శరవేగంగా సాగుతున్నాయి. డివిజన్ పరిధిలో అక్టోబర్లో ప్రారంభమైన పనులు ప్రధానంగా మెట్టుగూడ ప్రధాన రోడ్డును ఆనుకొని యమహా షోరూం పక్కన, విజయపురి కాలనీ, కిందిబస్తీ ప్రాంతాల్లో పూర్తవడం జరిగింది. ప్రస్తుతం ఆలుగడ్డ బావి ప్రాంతంలో పూడికతీత పనులు చురుకుగా సాగుతున్నాయి. రానున్నకాలంలో ఎలాంటి సమస్యలు రాకుండా ముందస్తుగా నాలాల్లో వ్యర్థాలను తొలగించడం జరుగుతుంది.
గతంలో తలెత్తిన సమస్యలు పునరావృతం కాకుండా అధికారులు పక్కా ప్రణాళికతో పనులను నిర్వహిస్తున్నారు. స్థానిక కార్పొరేటర్, స్టాండింగ్ కమిటీ సభ్యురాలు రాసూరి సునీత, సంబంధిత విభాగం అధికారులు ఎప్పటికప్పుడు పనులను పర్యవేక్షిస్తూ త్వరితగతిన పూర్తయ్యేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. వెంటవెంటనే వ్యర్థాలను తొలగిస్తూ పనుల్లో పురోగతి ఉండేలా చర్యలు తీసుకుంటున్నట్లు సంబంధిత అధికారులు చెబుతున్నారు.
డివిజన్ పరిధిలో దాదాపుగా నాలా పనులు పూర్తయ్యాయి. ఆలుగడ్డ బావి వద్ద పనులు చురుకుగా సాగుతున్నాయి. పనుల్లో జాప్యం లేకుండా ఎప్పటికప్పుడు ఉన్నతాధికారులతో పర్యవేక్షిస్తూ త్వరితగతిన పూర్తయ్యేలా చూస్తున్నాం. డిసెంబర్ చివరివారంలో పనులు పూర్తయ్యే విధంగా చర్యలు తీసుకుంటున్నాము,
– విశ్వతేజ, జీహెచ్ఎంసీ ఏఈ