రంగారెడ్డి, ఏప్రిల్ 13(నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ మెడలు వంచాలంటే ప్రజల చేతిలోకి ఒక అంకుశం కావాలని, అలాంటి అంకుశంలో పదునైన మొనదేలినటువంటి అంకుశం చేవెళ్ల ఎంపీ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ అని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. శనివారం చేవెళ్లలో నిర్వహించిన ప్రజాఆశీర్వాద సభలో ఆయన మాట్లాడుతూ అనుభవం ఉన్న వ్యక్తి అని, బలహీనవర్గాల కోసం కాసాని తన జీవితాన్ని ధారబోశారన్నారు. రాష్ట్ర ప్రజలందరికీ కాసాని సుపరిచితుడని, జడ్పీ చైర్మన్గా ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ప్రజానీకానికి ఎనలేని సేవ చేశారన్నారు.
చేవెళ్ల సభ సక్సెస్తో కాసాని విజయం ఖాయమైపోయిందని వ్యాఖ్యానించారు. బీసీలకు దమ్ముంటే బీసీ అభ్యర్థిని గెలిపించుకోవాలని కాంగ్రెస్ నాయకుడొకరు సవాల్ విసిరారని, కాసాని జ్ఞానేశ్వర్ను గెలిపించుకుని బీసీలు సత్తా చాటాలని పిలుపునిచ్చారు. అమలుగాని హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం మెడలు వంచాలంటే అన్ని ఎంపీ స్థానాల్లో బీఆర్ఎస్ పార్టీ గెలవాల్సిన అవసరం ఉందన్నారు.
బీఆర్ఎస్ ప్రభుత్వంలో చేవెళ్ల ప్రాంతాన్ని పారిశ్రామిక కేంద్రంగా తీర్చిదిద్దామని కేసీఆర్ పేర్కొన్నారు. షాబాద్, సీతారాంపురం, చందనవెల్లిలో వెల్స్పన్, కిటెక్స్, అమెజాన్ ఈస్టర్, ఎలక్ట్రిక్ వెహికిల్ తయారీ కంపెనీ, రైల్వే కోచ్ ఫ్యాక్టరీలను ఏర్పాటు చేశామన్నారు. వికారాబాద్, చేవెళ్ల, తాండూరు, పరిగి నియోజకవర్గాలకు సాగు నీళ్లు తెచ్చేందుకు పాలమూరు ప్రాజెక్టును చేపట్టామని చేవెళ్ల ప్రాంతానికే నీరందించేందుకు ఉద్దండాపూర్ రిజర్వాయర్ను నిర్మించామన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో హైదరాబాద్తో సహా రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలతోపాటు యావత్ తెలంగాణలో భూముల ధరలు ఎట్లుండె.. ఇప్పుడు ఎట్లున్నయో ప్రజలు గమనించాలన్నారు. ఉన్నట్టుండి రియల్ ఎస్టేట్ ఎందుకు ఆగిపోయిందని ప్రశ్నించారు.
దీని వెనుక ఉన్న బ్రోకర్లు ఎవరు? జోకర్లు ఎవరు? అని నిలదీశారు. సభలో మాజీ మంత్రులు సబితారెడ్డి, పొన్నాల లక్ష్మయ్య, టీఎస్ఐఐసీ మాజీ చైర్మన్ గ్యాదరి బాలమల్లు, ఎమ్మెల్యేలు కాలె యాదయ్య, ప్రకాశ్ గౌడ్, అరికెపూడి గాంధీ, ఎమ్మెల్సీలు వాణీదేవి, దయానంద్ గుప్తా, ఎగ్గే మల్లేశం, శాసన మండలి మాజీ చైర్మన్ స్వామిగౌడ్, మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్, మాజీ ఎమ్మెల్యేలు మెతుకు ఆనంద్, కొప్పుల మహేశ్ రెడ్డి, పైలెట్ రోహిత్ రెడ్డి, రసమయి బాలకిషన్, బీఆర్ఎస్ రాష్ట్ర యువనేత పట్లోళ్ల కార్తిక్ రెడ్డి, డీసీఎంఎస్ చైర్మన్ కృష్ణారెడ్డి, నియోజకవర్గ సమన్వయ కర్త రాంబాబు యాదవ్, జడ్పీటీసీలు పట్నం అవినాశ్ రెడ్డి, కాలె శ్రీకాంత్, నీరటి తన్విరాజ్, కాలె జయమ్మ, ఎంపీపీలు గోవర్ధన్రెడ్డి, నక్షత్ర, కాలె భవాని, కార్పొరేషన్ మాజీ చైర్మన్లు వెంకటేశ్వర్రెడ్డి, నాగేందర్గౌడ్, జిల్లా మహిళా విభాగం అధ్యక్షురాలు స్వప్న, మాజీ ఎంపీపీ మంగలి బాల్రాజ్, బీఆర్ఎస్ మండల అధ్యక్షులు ప్రభాకర్, నర్సింగ్రావు, గోపాల్, నాగిరెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్లు మిట్ట వెంకట రంగారెడ్డి, పాపారావు, నర్సింగ్ రావు, ప్రశాంత్ గౌడ్, వికారాబాద్ జడ్పీ వైస్ చైర్మన్ విజయ్ కుమార్, సీనియర్ నాయకులు కాసాని వీరేశం, కొంపల్లి అనంత రెడ్డి, దేశమళ్ల ఆంజనేయులు, కొప్పుల అనిల్ రెడ్డి, మల్లారెడ్డి, మంగలి యాదగిరి, కర్నె శివప్రసాద్, పోలీస్ రాంరెడ్డి పాల్గొన్నారు.