తెలుగు యూనివర్సిటీ, డిసెంబర్ 15. తెలుగు జాతి గర్వించదగిన గొప్ప వ్యక్తులు బాపు రమణలని వక్తలు కొనియాడారు. బాపురమణ అకాడమీ ఆధ్వర్యంలో తెలంగాణ సారస్వత పరిషత్తులో శుక్రవారం బాపు జయంతి సందర్భంగా 2023 సంవత్సరానికి బాపు రమణల పేరిట నెలకొల్పిన పురస్కారాలను ప్రముఖ చిత్రకారుడు డాక్టర్ ఏలే లక్ష్మణ్, ప్రముఖ రచయిత మాడభూషి దివాకరబాబుకు ప్రదానం చేసి ఘనంగా సత్కరించారు. అలాగే మధుర స్నేహ పురస్కారాలను చిత్రకారులు ఖరిడేహాల్ వెంకట భీమారావు, రచయిత కల్లూరి సత్యరామ ప్రసాద్లకు అందజేశారు.
ప్రముఖ రచయిత, నటులు తనికెళ్ల భరణి రచించిన శివ చిలుకలు, ముళ్లపూడి వెంకటరమణ రచన బుడుగు, సత్యమూర్తి కార్టూన్ల పుస్తకం రాముసోము, ప్రసాద్ కార్టూన్స్ రచన కార్టూన్ కాజాలు పుస్తకాలను ఈ సందర్భంగా వక్తలు ఆవిష్కరించారు. కార్యక్రమంలో రచయిత తనికెళ్ల భరణి, దర్శకులు రేలంగి నరసింహారావు, రచయిత, కవి సుద్దాల అశోక్ తేజ, నటులు డాక్టర్ సుదర్శన్,రాజీవ్ కనకాల, చిత్రకారులు ఆనంద్ గడప, భార్గవి తదితరులు పాల్గొన్నారు.