జవహర్నగర్, జనవరి 14 : నిషేధిత మాంజాను విక్రయిస్తున్న దుకాణాదారులను పట్టుకుని మాంజాను స్వాధీనం చేసుకున్నారు. జవహర్నగర్ ఇన్స్పెక్టర్ చంద్రశేఖర్ తెలిపిన వివరాల ప్రకారం… జవహర్నగర్ పోలీస్స్టేషన్ పరిధిలో 29 దుకాణాల్లో తనిఖీలు నిర్వహించగా ఆరు దుకాణాల్లో గాలి పటాలు, మాంజాసంద్లు విక్రయిస్తున్నారు. నిందితులు బీమగొండ నగేశ్, జంగ్,్ర ఎర్రం శ్రీనివాస్, బోనగిరి మహేశ్, కానుకుంట విశాల్, వెంకటస్వామిలను అరెస్ట్ చేశారు. వీరినుంచి 35 నిషేధిత మాంజా (గోలా కంపెనీ), 5 నిషేధించిన చక్రాలు, 5 పరిమితిలో నిషేంధించబడిన మాంజా ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
మేడిపల్లి పీఎస్ పరిధిలో మరో ఇద్దరు..
పీర్జాదిగూడ, జనవరి 14 : ప్రభుత్వ నిషేధిత చైనా మాంజాను విక్రయిస్తున్న ఇద్దరిని మేడిపల్లి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మేడిపల్లికి చెందిన రాజు, బాబు రోడ్డుపై పతంగుల దుకాణాలు ఏర్పాటు చేసి చైనా మాంజాను విక్రయిస్తున్నారు. శనివారం మేడిపల్లి పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని, 39 బాబిన్స్ చైనా మాంజాను స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
హయత్నగర్ పోలీస్స్టేషన్ పరిధిలో…
వనస్థలిపురం, జనవరి 14 : చైనా మాంజా విక్రయిస్తున్న వారిపై హయత్నగర్ పోలీసులు కేసు నమోదు చేశారు. హయత్నగర్ పోలీస్స్టేషన్ పరిధిలో పోలీసులు శనివారం రాత్రి దాడులు నిర్వహించారు. ఓల్డ్ హయత్నగర్లో పరసాని బాబురావు(42), కుంట్లూర్ రోడ్ శైలజా కాంప్లెక్స్ వద్ద హమీల్పూర్ ప్రకాశ్(42), భాగ్యలత వద్ద రమేశ్(42), బీడీఎల్ కాలనీ వద్ద సుంకరి నాగేశ్వరరావు(44) దుకాణాలపై దాడి చేశారు. వారిపై సుమోటో కేసులు నమోదు చేశారు.
మాంజాతో గొంతుకు బిగుసుకొని..
అమీర్పేట జనవరి 14 : ఫతేనగర్ ఫ్లై ఓవర్ మీద నుంచి వెళుతున్న ఓ ద్విచక్ర వాహనదారుడు మాంజా బిగుసుకొని ప్రమాదానికి గురయ్యాడు. సనత్నగర్ పోలీసుల కథనం ప్రకారం.. బహుదూర్పురకు చెందిన నగేశ్ శనివారం సాయంత్రం ద్విచక్ర వాహనంపై వెళుతుండగా ఫతేనగర్ ఫ్లైఓవర్పై మాంజా ఒక్కసారిగా గొంతుకు తగలడంతో కిందపడిపోయారు. గొంతుకు గాయాలు కావడంతో తోటి వాహనదారులు వెంటనే 108కు సమాచారం అందించగా, వారు వచ్చి సమీపంలోని ఓ ప్రైవేట్ దవాఖానకు తరలించారు. ప్రస్తుతం అక్కడ చికిత్స పొందుతున్నట్టు పోలీసులు తెలిపారు.