చార్మినార్, మే 2 : బ్యాంకుల్లో నకిలీ పత్రాలు సమర్పించి బురిడీ కొట్టించిన ఘటనలు తరుచూ కనిపిస్తూ ఉంటాయి. కానీ తప్పుడు పత్రాలు అందించి వేలం పాట నిర్వహించి బిడ్డర్లను మోసాలతోపాటు మానసిక వేధింపులకు గురి చేస్తున్న ఘటనతో వినియోగదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. చార్మినార్ పోలీస్స్టేషన్ పరిధిలోని ఇరానీగల్లీ ప్రాంతానికి చెందిన అమీరుద్దీన్ 2018లో చార్మినార్ కో ఆపరేటివ్ బ్యాంకు అధికారులు జారీ చేసిన ప్రకటనతో బిడ్డింగ్లో పాల్గొనేందుకు సిద్ధమయ్యారు.
అఫ్జల్గంజ్ ప్రాంతంలో కొనసాగుతున్న పెరల్ సిటి హోటల్ అమ్మకానికి ఉందంటూ బ్యాంకు అధికారులు నోటిఫికేషన్ జారీ చేశారు. బిడ్డింగ్లో పా ల్గొన్న అమీరుద్దీన్ అత్యధిక ధరకు బిడ్డింగ్ వేసి హోటల్ కొనుగోళ్లకు చార్మినార్ బ్యాంకు అధికారులు సూచించిన విధంగా 6,27,000 చెల్లించినట్లు తెలిపారు. ఆనాటి నుండి నేటి వరకు చార్మినార్ బ్యాంకు అధికారులు హోటల్ పెరల్సిటీని కానీ, ఏ ఇతర అధికారిక ద్రువీకరణ పత్రాలను అందించలేదని వాపోయారు.
ఈ విషయమై బ్యాంకు అధికారులకు ఇటీవల విన్నవిస్తే ఆ ప్రాపర్టీ మరో బ్యాంకు ఆధీనంలో ఉందని, సేల్స్ మేనేజర్ చేసిన పొరబాటు వల్ల చార్మినార్ బ్యాంకు వేలంపాట నిర్వహించిందన్నారు. వేలం వేయడానికి ముందు అధికారులు స్థిరాస్తిని తనిఖీ చేయకుండా వినియోగదారులను, ప్రజలను ఎలా మభ్యపెడతారని ప్రశ్నిస్తున్నారు. చార్మినార్ బ్యా ంకు అధికారులు బిడ్డర్లను మోసం చేయడంతోపాటు ఇతర బ్యాంకు ఆధీనంలో ఉన్నట్లు రిజిస్ట్రేషన్ అధికారులు జారీ చేసిన ఈసీ పత్రాలు ఉన్నా వేలంపాట ఎలా నిర్వహిస్తారని ప్రశ్నించారు. బిడ్డింగ్లో తాము చెల్లించిన ఈఎండీ, లేదా హోటల్ పెరల్ సిటీని అప్పగించాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు.