సిటీబ్యూరో, ఫిబ్రవరి 8 (నమస్తే తెలంగాణ): సైబర్నేరాలలో కీలకమైన బ్యాంకు ఖాతాలను కమిషన్ల పద్దతిలో సరఫరా చేస్తున్న వారికి ఇప్పుడు తెలుగు రాష్ర్టాలు అడ్డాగా మారుతున్నాయి. సైబర్నేరగాళ్లకు బ్యాంకు ఖాతాల(మ్యూల్)ను కమిషన్ పద్దతిలో ఇవ్వడంలో గతంలో ఈశాన్య, ఉత్తర రాష్ర్టాల బ్యాంకు ఖాతాదారులే ఎక్కువగా ఉండేవాళ్లు. నేడు అక్కడి నుంచి తెలంగాణ, ఏపీ, మహారాష్ట్రకు చెందిన వారు బ్యాంకు ఖాతాలను సైబర్నేరగాళ్లకు సరఫరా చేసే రాకెట్లోకి ఎంట్రీ అవుతున్నారు. ఇటీవల మల్కాజిగిరి సైబర్క్రైమ్ పోలీసులు 11 మంది సైబర్నేరగాళ్లను అరెస్ట్ చేశారు. అందులో తొమ్మిది మంది వరకు హైదరాబాద్తో పాటు ఏపీకి చెందిన వారే ఉండడం ఆందోళన కల్గిస్తోంది.
ఒక పక్క సైబర్నేరాల బారిన పడుతున్న వారి సంఖ్య గత ప్రతి ఏడు పెరుగుతూ వస్తున్నది. పోలీసులు ఈశాన్య రాష్ర్టాలు, ఉత్తర భారతదేశంలో ఉన్న బ్యాంకు ఖాతాదారుల వరకు వెళ్లి ఆయా కేసులను అక్కడితో ఆపేస్తున్నారు. బ్యాంకు ఖాతాదారుల వద్దనే కీలకమైన సైబర్ నేరగాళ్ల లింక్ కట్ అవుతూ వస్తోంది. చాల కేసులలో బ్యాంకు ఖాతాల లింక్లతో కీలక నిందితులను సైతం పోలీసులు పట్టుకున్న సందర్బాలున్నాయి. గతంలో సైబర్ నేరాలకు పాల్పడేవారు ఉత్తర భారతదేశానికి చెందిన వారు ఎక్కువగా ఉండగా మోసపోయే వారు దక్షిణ భారతీయులు ఎక్కువగా ఉంటూ వస్తున్నారు. కీలకమైన సైబర్ నేరగాళ్లు తెలంగాణ, ఏపీ వాసులపై దృష్టి పెట్టడంతో కమిషన్లకు కక్కుర్తి పడుతూ చాల మంది బ్యాంకు ఖాతాలను నేరగాళ్లకు అందిస్తున్నారు.
సైబర్ నేరాలు చేయడం ఒక ముఠా పని అయితే.. కేవలం బ్యాంకు ఖాతాలను సేకరించడం మరో ముఠా పనిగా సాగుతున్నది. వీటికి టెలిగ్రామ్, వాట్సాప్, ఫేస్బుక్ లాంటి సోషల్మీడియా ఫ్లాట్ ఫామ్స్ను వేదికగా చేసుకుంటున్నారు. పార్ట్టైమ్ ఉద్యోగాలు, ట్రేడింగ్లో లాభాలంటూ మేసేజ్లు పంపించే వారు కొందరైతే, ఉద్యోగాలున్నాయంటూ మేసేజ్లు పెడుతూ వాళ్లతో కొన్నాళ్లు ఉద్యోగాల గూర్చి మాట్లాడుతూ బ్యాంకు ఖాతాల ప్రస్తావన తెస్తున్నారు.
ఇలా బ్యాంకు ఖాతాలు తమకు ఇస్తే… మీ ఖాతాలో డిపాజిట్ అయ్యే మొత్తంలో 5 నుంచి 30 శాతం వరకు పరిస్థితులను బట్టి కమిషన్ ఇస్తామంటూ ప్రతిపాదనలు పెడుతూ ఈజీగా బ్యాంకు ఖాతాలను కీలకమైన సైబర్నేరగాళ్లు సేకరిస్తున్నారు. వాట్సాప్, టెలిగ్రామ్లో కమిషన్లు మాట్లాడుకుంటూ బ్యాంకు ఖాతాలు సేకరిస్తున్నారు. బ్యాంకు ఖాతాను కమిషన్ పద్దతిలో అప్పగించే వారు, ఆయా బ్యాంకు ఖాతాలకు సంబంధించిన ఏటీఎం కార్డులు, ఇంటర్నెట్ పాస్వర్డ్ వివరాలన్ని బ్యాంకు ఖాతాలు సేకరించే ముఠా చేతికి అప్పగించాల్సి ఉంటుంది.
సైబర్నేరగాళ్ల ముఠాలకు కమిషన్ పద్దతిలో బ్యాంకు ఖాతాలను అప్పగించే వారి వివరాలు ఎప్పటికప్పుడు ఆయా ముఠాలు కీలక నిందితులకు పంపిస్తుంటాయి. బాధితులను వివిధ రకాలుగా మోసాలు చేసే సైబర్నేరగాళ్లు, కమిషన్ పద్దతిలో సేకరించిన బ్యాంకు ఖాతాలలో బాధితుల నుంచి డబ్బు డిపాజిట్ చేయిస్తారు. బ్యాంకు ఖాతాలో డబ్బు డిపాజిట్ కాగానే ఆయా ఖాతాదారుల కమిషన్ మినహాయించుకొని మిగతా సొమ్ము నేరగాళ్లకు పంపించాలి.
అయితే ఆయా ఖాతాలను సైబర్నేరగాళ్ల ముఠాలే నిర్వహిస్తుండడంతో ఎప్పటికప్పుడు డిపాజిట్లకు సంబంధించిన మేసేజ్లు కూడా వాళ్లకే వస్తుంటాయి. బ్యాంకు ఖాతాలలో డిపాజిట్ అయిన సొమ్ములో కమిషన్లు మినహాయించి మిగతా సొమ్మును ఇతర ఖాతాలకు బదిలీ చేయడం, వాటిని ఏటీఎంల ద్వారా డ్రా చేయడం చేస్తుంటారు. ఇలా సైబర్నేరగాళ్లు మ్యూల్ ఖాతాలను అపరేట్ చేస్తున్నారు. అయితే ఈజీగా డబ్బు వస్తుండడంతో చాల మంది సైబర్నేరగాళ్ల ముఠాల చేతికి చిక్కుతున్నారు. ఇప్పుడు ఇలా బ్యాంకు ఖాతాలు ఇస్తున్న వారు హైదరాబాద్కు చెందిన వారు కూడా ఎక్కువగా ఉండడం ఆందోళన కల్గిస్తోంది.