బంజారాహిల్స్, ఆగస్టు 1: పాతకక్షలతో స్నేహితుడిని హత్య చేసేందుకు యత్నించిన రౌడీషీటర్ను బంజారాహిల్స్ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. వివరాల్లోకి వెళ్తే.. బంజారాహిల్స్ రోడ్ నం.2లోని ఇందిరానగర్లో నివాసం ఉంటున్న కోడూరు నవీన్కుమార్(22) రౌడీషీటర్. ఇటీవల ఇందిరానగర్లోని తన ఇంటిని అమ్మేసి జగద్గిరిగుట్టకు మకాం మార్చాడు. ఇదిలా ఉండగా.. ఇందిరానగర్లో ఉన్న సమయంలోనే మధురానగర్కు చెందిన సాయికుమార్తోపాటు మరికొంత మంది స్నేహితులతో గొడవలున్నాయి. ఈ గొడవల నేపథ్యంలో తనను హత్య చేసేందుకు సాయికుమార్ ప్లాన్ వేస్తున్నాడనే అనుమానంతో నవీన్ ముందుగానే ఆన్లైన్లో ఓ కత్తిని కొనుగోలు చేశాడు. దాన్ని ఇందిరానగర్లోని ఓ డ్రైనేజీ మ్యాన్హోల్లో దాచాడు. ప్రణాళికలో భాగంగా ఆదివారం రాత్రి తొట్టెల ఊరేగింపుకు ఇందిరానగర్కు వచ్చాడు.
స్నేహితులతో కలిసి మద్యం సేవించి సాయికుమార్తోపాటు మరికొంత మందితో గొడవకు దిగి ఒకరిపై ఒకరు దాడులకు పాల్పడ్డారు. దీంతో స్థానికులు వారిని విడిపించారు. కాసేపటికి తొట్టెల ఊరేగింపులో రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తున్న సాయికుమార్ను వెంబడించిన నవీన్ డ్రైనేజీ మ్యాన్హోల్లో దాచిన కత్తితో దాడి చేసి పారిపోయాడు. బాధితుడి ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన బంజారాహిల్స్ పోలీసులు నిందితుడు నవీన్ను అరెస్ట్ చేసి మంగళవారం రిమాండ్కు తరలించారు.