అమీర్పేట, ఆగస్టు 10: బల్కంపేట ఎల్లమ్మ భక్తులకు ఇక పార్కింగ్ నుంచి ఊరట లభించనుంది. దాదాపు ఐదున్నర కోట్ల వ్యయంతో అధునాతన పార్కింగ్ కాంప్లెక్స్ను ఏర్పాటు చేయనున్నారు. దీంతో పార్కింగ్ బాధలు తీరనున్నాయి. బల్కంపేట ఎల్లమ్మ భక్తుల కొంగు బంగారంగా వెలిసిన అమ్మవారు. అమ్మవారిని దర్శించుకునేందుకు నగర నలుమూలల నుంచే కాకుండా ఇరుగు పొరుగు జిల్లాల నుంచి భక్తులు అనేకం వస్తుంటారు. అమ్మవారి దర్శనానికి వచ్చిన భక్తులకు అనాదిగా ఆలయ పరిసరాల్లో సదుయాపాల కొరత బాధిస్తోంది. ఆలయానికి ప్రతి ఆది, మంగళ, శుక్రవారాల్లో భక్తులు పోటెత్తుతారు. దీంతో వారి వాహనాలు నిలుపుకునేందుకు అనువైన చోటు లేకపోవడం ప్రధాన సమస్యగా మారింది.
అయితే, దేవాలయ వసతి కాంప్లెక్స్ సమీపంలో ఉన్న కొంత ప్రభుత్వ స్థలాన్ని దేవాదాయ శాఖ పరిధిలోకి తీసుకువచ్చేందుకు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చొరవ తీసుకున్నారు. దీంతో సెల్లార్, గ్రౌం డ్లతో పాటు 1,2,3 (టెర్రాస్ పార్కింగ్) అంతస్తులను దాదాపు 28 వే ల చదరపు అడుగుల విస్తీర్ణంతో నిర్మించేందుకు చక్కటి అవకాశం చిక్కిం ది. సెల్లార్, గ్రౌండ్లతో పాటు 1, 2, 3 అంతస్తులతో పార్కింగ్ కాంప్లెక్స్ నిర్మాణాలు జరుగనున్నాయి. ఇందులో సెల్లార్లో అధునాతన హైడ్రాలిక్ కార్ ఎలివేటర్లు ఏర్పాటు కానున్నాయి. మూడు అంతస్తులలో కలిపి ఏక కాలంలో దాదాపు 50 వరకు కార్లు పార్కింగ్ చేసుకునే వీలుంది. ఇందుకు భక్తులకు సౌకర్యవంతంగా ఉండేలా వ్యాలెట్ పార్కింగ్ అందుబాటులో ఉండనుంది. అధునాతన వసతులతో కూడిన పార్కింగ్ కాం ప్లెక్స్ నిర్మాణాలు త్వరలో ప్రారంభం కానున్నాయని ఆలయ ఈవో అన్నపూర్ణ తెలిపారు. కాంప్లెక్స్కు నిధులు ఇప్పటికే మంజూరయ్యాయన్నారు.