జీడిమెట్ల, మార్చి 29 : హైటెక్ టెక్నాలజీని ఉపయోగించి పేకాట ఆడుతున్న స్థావరంపై బాలానగర్ ఎస్ఓటీ పోలీసులు దాడి చేసి ఆరుగురిని అరెస్టు చేసి వారి వద్ద నుంచి రూ.29,11,850 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. షాపూర్నగర్లోని బాలానగర్ జోన్ డీసీపీ కార్యాలయంలో బుధవారం సాయంత్రం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీసీపీ టీ.శ్రీనివాస్రావు వివరాలు వెల్లడించారు. బాచుపల్లి పోలీస్స్టేషన్ పరిధిలోని మయూర ఫార్చున్ గ్రీన్ హౌస్లో నివాసముండే మలిపెద్ది అవినాశ్ అలియాస్ బాబీ గత కొన్ని నెలల నుంచి అదే అపార్ట్మెంట్లో పేకాట శిబిరాన్ని నిర్వహిస్తున్నాడు. దీని కోసం ప్రత్యేకంగా ఓ సాఫ్ట్వేర్ను, చైనా మొబైల్, ట్రాన్స్ మీటర్స్ను వినియోగిస్తాడు. ఆట ఆడే సమయంలో పక్కనే మొబైల్ ఫోన్ పెట్టుకుంటాడు. పేక ముక్కలను వేసే క్రమంలోనే మొబైల్ స్కాన్ చేస్తుంది. అందులో ఆట ఎవరు గెలుస్తారని అతడికి ముందే తెలుస్తుంది. ఆ ఆటలో కొనసాగాలా? లేదా అతడు గెలిచే అవకాశం ఉంటే అలాగే ఆటను కొనసాగిస్తూ డబ్బులు పెడుతూ ఉంటాడు.
అతడు ఆటలో వరుసగా గెలుస్తున్నాడని ఎవరికైనా అనుమానం వచ్చి అక్కడి నుంచి ఫోన్ తీసివేయాలని చెబితే పక్కనే పెట్టేస్తాడు. ఇలా జరిగే అవకాశం ఉందని గ్రహించి అతడు దగ్గర ముందే సిద్ధంగా ఉంచుకున్న రూ.500 నోట్ల కట్టల మధ్యలో ఓ ట్రాన్స్మీటర్, స్కానింగ్ పరికరాన్ని సిద్ధంగా ఉంచుకుంటాడు. వెంటనే ఆ ట్రాన్స్ మీటర్ను ఆన్ చేస్తాడు. చెవిలో మైక్రో ఫోన్ ఉండటంతో మళ్లీ పేక ముక్కలు వేసినా ఆ స్కానింగ్ వెంటనే గుర్తించి మైక్రో ఫోన్లో వాయిస్ ద్వారా చెబుతుంది. ఇలా కొన్ని నెలల నుంచి వసూలు చేస్తున్న నిర్వాహకుడు అవినాశ్(35)తో పాటు పేకాట రాయుళ్లు దండు రాజేశ్(39), సోదిశెట్టి రాఘవరావు (32), తన్నూరు కోటేశ్వర్రావు(40), గప్ప నరేశ్కుమార్(48), బాదరు గంగారాజు(44)లను మంగళవారం బాచుపల్లిలో అరెస్టు చేసి బుధవారం రిమాండ్కు తరలించినట్లు డీసీపీ తెలిపారు. వారి వద్ద నుంచి మోసానికి వినియోగించిన చైనా ఫోన్, మైక్రో ఫోన్లు 3, ట్రాన్స్మీటర్కు వినియోగించిన రూ.500 నోట్ల కట్ట, రూ.29,11,850 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. మొత్తం సొత్తు విలువ రూ.35 లక్షలు ఉంటుందని తెలిపారు. ఈ సమావేశంలో ఎస్ఓటీ అదనపు డీసీపీ శోభన్, కూకట్పల్లి ఏసీపీ చంద్రశేఖర్, బాలానగర్ జోన్ ఎస్ఓటీ సీఐ రాహుల్ దేవ్, బాలానగర్ సీఐ నర్సింహారెడ్డిలతోపాటు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. ఈ కేసును ఛేదించిన పోలీస్ సిబ్బందిని ఆయన అభినందించారు.