సంకల్పం ముందు సమస్యలు బలాదూర్ అవుతాయని తెలంగాణ ప్రభుత్వం మరోసారి రుజువుచేసింది. ఎన్నో ఏండ్లుగా ట్రాఫిక్ సమస్యతో సతమతమైన బాలానగర్ పారిశ్రామికవాడ వాసుల కష్టాలు దూరం కానున్నాయి. సుమారు రూ.387 కోట్లతో చేపట్టిన వంతెన పనులు నాలుగేండ్లలోనే పూర్తి చేసుకుని ప్రారంభానికి సిద్ధం కావడం పట్ల ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
బాలానగర్, జూలై 4 : బాలానగర్ పారిశ్రామిక వాడలో ఫ్లైఓవర్ నిర్మాణం చేపట్టడంతో బాలానగర్ రూపురేఖలు పూర్తిగా మారిపోయాయి. నాటి బాలా నగర్కు నేటి బాలానగర్కు ఎంతో వ్యత్యాసం ఏర్పడింది. బాలానగర్ నర్సాపూర్ చౌరస్తా అంటే ట్రాఫిక్ ఇబ్బం దులకు పుట్టినిల్లుగా ఉండేది. గతంలో ఇక్కడ వాహనాలు కదలాలంటే గంటల తరబడి ఇబ్బందులు పడేవారు. సిగ్నల్ దాటాలంటే ప్రయాస తప్పేదికాదు. నేడు వంతెనను పూర్తిచేసుకోవడంతో ఈ ప్రాంతం బాలానగరేనా అన్న అనుమానం కలుగక మానదు. టీఆర్ఎస్ ప్రభు త్వం ఏర్పడిన తర్వాతనే నగరంలో ఫ్లైఓవర్లు, స్కైవేలు, అండర్పాస్లు నిర్మిస్తూ ప్రజలకు వెసులుబాటు కల్పిస్తున్న విషయం తెలిసిందే.
ఇందులో భాగంగానే కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు బాలానగర్లో నెలకొన్న ట్రాఫిక్ ఇబ్బందులు తొలగించాలనే తపనతో ట్రాఫిక్ సమస్యను ముఖ్యమంత్రి కేసీఆర్కు వివరించారు. ఇందుకు సీఎం కేసీఆర్ సానుకూలంగా స్పందించడంతో పాటు రూ .387 కోట్ల నిధులు కేటాయించారు. ఈ నేపథ్యంలోనే 2017 అగస్టు 21 వ తేదీన పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా బాలానగర్లో ఫ్లైఓవర్ పనులకు శ్రీకారం చుట్టారు. చేపట్టిన ఫ్లై ఓవర్ పనులను రెండేండ్లలో పూర్తి చేయాల్సి ఉండగా భూసేకరణ విషయంలో కొందరూ స్థల యజమానులు కోర్టును ఆశ్రయించడంతో తీవ్ర జాప్యం ఏర్పడింది. ఈ క్రమంలో ఫ్లై ఓవర్ పనులను 2018 ఏప్రిల్ నెలలో చేపట్టారు. పనులు పూర్తి కావడానికి (ప్రస్తుతానికి) 3 సంవత్సరాల 10 నెలల సమయం పట్టిందని చెప్పవచ్చు.
బాలానగర్లో 1.13 కిలోమీటర్ల దూరం.. ఆరులేన్ లు, 24 మీటర్ల వెడల్పు, 26 పిల్లర్లతో ఫ్లైఓవర్ నిర్మాణం చేపట్టారు. రూ. 387 కోట్ల నిధులు వెచ్చించగా ఫ్లైఓవర్ నిర్మాణ పనులకు 70 కోట్లు, కట్టడాల తొలగింపు పను లు, విద్యుత్ లైన్ల తరలింపు, తాగునీటి పైప్లైన్, రోడ్డు పునరుద్ధరణ పనులకుగాను 52 కోట్లు, భూసేకరణకు 26 5 కోట్ల నిధులు వెచ్చించారు. ఆయా పిల్లర్లపై 22 ఆర్సీసీ గడ్డర్లు, 3 స్టీల్ గడ్డర్లు ఏర్పాటు చేశారు. ఇదిలా ఉండగా ఆర్సీసీ గడ్డర్లు 30 మీటర్ల పొడవు 24 మీటర్ల వెడల్పుతో ఉండగా 3 స్టీల్ గడ్డర్లు మాత్రం 40 మీటర్ల పొడవు, 24 మీటర్ల వెడల్పు కొలతలతో స్పాన్లు నిర్మించారు. ఫ్లైఓవర్ మొత్తంలో 26 పిల్లర్లలో గడ్డర్ల ఏర్పాటు చేశారు. ఫ్లైఓవర్పై బీటీరోడ్డు వేయడంతో పాటు మధ్యలో డివైడర్ సైతం ఏర్పాటు చేసి వాటి మధ్య చక్కటి పూల మొక్కలు నాటారు. ఫ్లైఓవర్కు ఇరువైపులా జిగేల్మనే ఎల్ఈడీ వీధిలైట్లు అమర్చారు. పనులన్నీ పూర్తి చేసుకొని ఈ నెల 6వ తేదీన పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా ఫ్లైఓవర్ను ప్రారంభించడానికి సంబంధిత అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు.