తుది దశలో నర్సాపూర్ చౌరస్తా ఫ్లై ఓవర్ నిర్మాణ పనులు
లాక్డౌన్ సమయంలో శరవేగంగా నగరాభివృద్ధి
జూన్ 2న ‘పీవీ ఎక్స్ప్రైస్ వే’ పై రెండు ర్యాంపులు ప్రారంభం
లాక్డౌన్ సమయంలోనూ మహా నగరంలో మౌలిక వసతుల కల్పనకు, నగర అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నది. హైదరాబాద్ మహా నగరాభివృద్ధి సంస్థ (హెచ్ఎండీఏ) సుమారు రూ.380 కోట్ల వ్యయంతో చేపట్టిన బాలానగర్ ఫ్లై ఓవర్ నిర్మాణ పనులు చివరి దశకు చేరుకున్నాయి. ప్రస్తుతం, లాక్డౌన్ అమల్లో ఉన్నా, నిర్మాణం రంగంలో పనులు చేపట్టేందుకు వెలుసుబాటు ఇచ్చి శరవేగంగా పనులు చేయిస్తున్నారు. నగరంలో అత్యంత ట్రాఫిక్ రద్దీ ఉండే ప్రాంతాల్లో బాలానగర్ ఒకటి. ఎన్నో ఏండ్లుగా ఇక్కడ ఫ్లై ఓవర్ నిర్మాణం చేపట్టాల్సి ఉన్నా, ఉమ్మడి రాష్ట్రంలో గత ప్రభుత్వాలు ఎంతో నిర్లక్ష్యంతో చేశాయి. దీంతో ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ ప్రభుత్వం 2017లో బాలానగర్ ఫ్లై ఓవర్ నిర్మాణానికి శంకుస్థాపన చేసింది. సుమారు కిలో మీటరున్నర దూరం ఉండే ఫ్లై ఓవర్ నిర్మాణం కోసం పెద్ద మొత్తం ఆస్తులను సేకరించి పనులు మొదలు పెట్టారు. ప్రస్తుతం ఈ పనులు చివరి దశలో ఉన్నాయి. జూన్ మొదటి వారం వరకు అన్ని రకాల నిర్మాణ పనులను పూర్తి చేసి, జూన్ 15న ఫ్లై ఓవర్ను ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కేటీ రామారావు బాలానగర్ ఫ్లై ఓవర్ను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని ఆదేశించడంతో హెచ్ఎండీఏ ఇంజినీరింగ్ విభాగం అధికారులు నిత్యం క్షేత్ర స్థాయిలో ఉండి నిర్మాణ పనులను పర్యవేక్షిస్తున్నారు.
జూన్ 2న పీవీ ఎక్స్ప్రెస్ వే ర్యాంపులు ప్రారంభం..
నగరం నుంచి శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం వెళ్లేందుకు వీలుగా నిర్మించిన పీవీ ఎక్స్ప్రెస్ను అనుసంధానంగా నిర్మిస్తున్న రెండు ర్యాంపుల నిర్మాణం దాదాపు పూర్తయింది. జూన్ 2న ఈ ర్యాంపులను ప్రారంభించేందుకు హెచ్ఎండీఏ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. సుమారు రూ.22 కోట్ల వ్యయంతో అత్తాపూర్ వద్ద చేపట్టిన రెండు ర్యాంపులు స్థానికంగా ఎంతో కీలకమైనవి. మెహిదీపట్నం నుంచి ఆరాంఘర్ వరకు ఉన్న 11 కి.మీ ఇన్నర్ రింగు రోడ్డు మార్గంలో ట్రాఫిక్ రద్దీ గణనీయంగా పెరిగిన నేపథ్యంలో పీవీ ఎక్స్ప్రెస్ వేను వినియోగించేందుకు వీలుగా కొత్తగా రెండు ర్యాంపులు (ఒకటి పైకి ఎక్కేందుకు, మరొకటి కిందకు దిగేందుకు) నిర్మిస్తున్నారు. రెండు ర్యాంపుల నిర్మాణం పూర్తయి అందుబాటులోకి వస్తే అటు మెహిదీపట్నం నుంచి అత్తాపూర్, రాజేంద్రనగర్ ప్రాంతాలకు 5-10 నిమిషాల వ్యవధిలోనే చేరుకోవచ్చు. అదే విధంగా అత్తాపూర్ నుంచి మెహిదీపట్నం వెళ్లాలన్నా పీవీ ఎక్స్ప్రెస్ వే మీదుగా వెళ్లేందుకు ఈ ర్యాంపులు వాహనదారులకు అందుబాటులోకి రానున్నాయి.