సిటీబ్యూరో, జూలై 22(నమస్తే తెలంగాణ): మీకు నిద్ర సరిపోలేదా.. అయితే వాహనాన్ని నడపకండి.. అలా చేస్తే ప్రమాదం చోటు చేసుకోవడం ఖాయం.. రెండు రోజుల కిందట బాలానగర్ ఫ్లై ఓవర్పై జరిగిన ఓ రోడ్డు ప్రమాదం ఇందుకు నిదర్శనమని పోలీసులు హెచ్చరిస్తున్నారు. సీసీ కెమెరాల దృశ్యాలు పరిశీలించగా.. ఈ రోడ్డు ప్రమాదం తొలుత అంతుచిక్కని ప్రశ్నగా మారింది. అయితే, ఈ ప్రమాదంపై దర్యాప్తు చేపట్టిన పోలీసు అధికారులు.. ఫిర్యాదు చేసిన మృతుడి సోదరుడిని ఆరా తీశారు. ప్రకాశం జిల్లాకు చెందిన మణికంఠ లారీ డ్రైవర్గా పని చేస్తున్నాడు. ఈనెల 19న రాత్రంతా డ్రైవింగ్ చేసి, 20వ తేదీన ఉదయం కేపీహెచ్బీకి వచ్చాడు. ఆ తర్వాత నిద్రపోలేదు.. కొద్దిపాటి విశ్రాంతి కూడా తీసుకోకుండా ద్విచక్ర వాహనంపై కేపీహెచ్బీ నుంచి తిరుమలగిరికి బయలు దేరాడు. సరిగా 11.51 నిమిషాలకు బాలానగర్ ఫ్లైఓవర్పైకి ఎక్కి ముందుకు సాగుతున్నాడు. ఏమైందో తెలియదు.. ఫ్లై ఓవర్పై కుడివైపు ఉన్న మణికంఠ సరాసరి ఎడమవైపునకు వచ్చి రెయిలింగ్ను ఢీకొట్టి గాయాలతో మరణించాడు. నిద్రలేకపోవడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్టు పోలీసులు చెబుతున్నారు.