Hyderabad | హైదరాబాద్ : బాచుపల్లి పోలీసు స్టేషన్ పరిధిలోని ప్రగతి నగర్ ఎన్ఆర్ఐ కాలనీలో నాలుగేళ్ల బాలుడు మిథున్ రెడ్డి నాలాలో పడి ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. బాలుడి మృతికి కారణమైన ఇద్దరు వ్యక్తులపై పోలీసులు కేసు నమోదు చేశారు.
సూర్యాపేట జిల్లా ఆత్మకూర్(ఎస్) మండలం మిడ్తనపల్లికి చెందిన సంతోష్ రెడ్డి, దివ్య శ్యామల దంపతులు ఎన్ఆర్ఐ కాలనీలో నివాసం ఉంటున్నారు. ఈ దంపతుల కుమారుడు మిథున్ రెడ్డి(4) మంగళవారం ఉదయం అపార్ట్మెంట్ ముందు ఆడుకుంటున్నాడు. అపార్ట్మెంట్ గేటు పక్కనే ఉన్న మ్యాన్ హోల్ తెరిచి ఉండటంతో.. ప్రమాదవశాత్తూ నాలాలో పడిపోయాడు. సమాచారం అందుకున్న బాచుపల్లి పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. పరిస్థితిని సమీక్షించి ఇద్దరు గజ ఈతగాళ్లను రప్పించారు. రెండు పడవల సాయంతో తుర్క చెరువులో నాలుగైదు గంటల పాటు తీవ్రంగా శ్రమించి, అదే రోజు సాయంత్రం 6 గంటలకు బాలుడి మృతదేహాన్ని బయటకు తీశారు.
ఇక బాలుడు ఎలా నాలాలో పడిపోయాడనే విషయంపై పోలీసులు దృష్టి సారించారు. మంగళవారం ఉదయం నుంచి ఏం జరిగిందనే విషయాన్ని తెలుసుకునేందుకు సీసీటీవీ ఫుటేజీని క్షుణ్ణంగా పరిశీలించారు. రోడ్డుపై నిలిచిన వరద నీరు మళ్లించేందుకు మంగళవారం ఉదయం 8:20 గంటలకు కాలనీ అసోసియేషన్ ప్రతినిధి.. వాచ్మెన్తో మ్యాన్ హోల్ తీయిస్తున్న దృశ్యాలు రికార్డు అయ్యాయి. మూత పక్కకు తీసిన మ్యాన్ హోల్ వద్ద ఎలాంటి రక్షణ చర్యలు చేపట్టలేదు. దీంతో ఉదయం 11 గంటలకు అపార్ట్మెంట్ బయట ఆడుకుంటున్న మిథున్ రెడ్డి నాలాలో పడిపోయాడు. ఈ ఘటనకు కారణమైన అపార్ట్మెంట్ వాచ్మెన్, కాలనీ అసోసియేషన్ ప్రతినిధిపై పోలీసులు కేసు నమోదు చేశారు.