ఉస్మానియా యూనివర్సిటీ: రాష్ట్రంలోని ఓయూ, జేఎన్టీయూ, కాకతీయ, శాతవాహన, మహాత్మా గాంధీ వంటి ప్రభుత్వ యూనివర్సిటీలలో బీటెక్ బయోటెక్నాలజీ రెగ్యులర్ కోర్సును 2025-26 విద్యా సంవత్సరంలోనే ప్రారంభించాలని ఓయూ అధ్యాపకుడు డాక్టర్ అడ్డగట్ల రవీందర్ డిమాండ్ చేశారు. కొవిడ్ లాంటి ఎన్నో మహమ్మారులను నియంత్రించే వాక్సిన్ ను బయోటెక్నాలజీ నిపుణులేనని గుర్తు చేశారు.
మానవాళి మనుగడకి ముందుచూపుతో, భవిష్యత్ బయోవార్ మహమ్మారులను, పెను సవాళ్లను ఎదుర్కొనే విధంగా మానవాళి బంగారు భవిష్యత్ కోసం కష్టపడుతున్నారని డాక్టర్ అడ్డగట్ల రవీందర్ చెప్పారు. బయోటెక్నాలజీ విభాగంపై సామాజిక సృహయే వేలాది తెలంగాణ నిరుపేద విద్యార్థులకు ఊరట అని అభిప్రాయపడ్డారు. ప్రభుత్వ యూనివర్సిటీలో ఎంసెట్ మెరిట్తో నిరుపేద విద్యార్థులకు స్థానిక కళాశాలలో ఇంజినీరింగ్ విద్యా ఫీజు రీయింబర్స్మెంట్తో అభ్యసించే సువర్ణ అవకాశం లభిస్తుందని అన్నారు. దేశమంత ఒక రూల్, కానీ మన తెలుగు రాష్ట్రాలలో మరో రూల్ ఉందని ఆరోపించారు.
దీంతో మన తెలుగు రాష్ట్ర విద్యార్థులు పక్క రాష్ట్రలకు వెళ్లాల్సిన పరిస్థితి తలెత్తుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ వైఖరి కారణంగా ఒక్కో విద్యార్థికి రూ.15-20 లక్షల ఆర్థిక భారం పడుతోందని వాపోయారు. ఎంపీసీ విద్యార్థులు ఐఐటీ జేఈఈ పరీక్ష ద్వారా ఐఐటీ, ఎన్ఐటీలలో ప్రవేశం పొందవచ్చని వివరించారు. కానీ బైపీసీ విద్యార్థులు ఆ కోర్సులో చేరేందుకు అవకాశం లేదని అన్నారు. దాంతో వారు పక్క రాష్ట్రాలకు వెళ్లి లక్షల ఖర్చుతో బీటెక్ చదువుతున్నారని వాపోయారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి బైపీసీ విద్యార్థులకు సైతం బీటెక్ బయోటెక్నాలజీలో చేరేందుకు అవకాశం కల్పించాలని విజ్ఞప్తి చేశారు. మన రాష్ట్రంలో ఇప్పటికే ప్రైవేటు యూనివర్సిటీలలో బైపీసీ విద్యార్థులకు బీటెక్లో చేరేందుకు అవకాశం కల్పిస్తున్నాయని పేర్కొన్నారు. కొవిడ్ పరిణామాలతో ప్రపంచ వ్యాప్తంగా బయోటెక్నాలజీ రంగానికి ప్రాధాన్యం పెరిగిందని, ఈ రంగంలో నిపుణుల కొరతను అధిగమించేందుకు ఈ నిర్ణయం దోహదపడుతుందని చెప్పారు.