సిటీబ్యూరో, జూన్ 3 (నమస్తే తెలంగాణ): ‘వీ లవ్ సైక్లింగ్.. వియ్ లవ్ సైక్లింగ్’ ఈ నినాదాలు నెక్లెస్ రోడ్డులో మార్మోగాయి. ప్రకృతిని రక్షించుకోవడంలో కాలుష్యాన్ని అంతమొందించే పోరులో సైక్లింగ్ వినియోగం పెరగాల్సిన ప్రాధాన్యతను చాటేందుకు 500 మంది సైక్లిస్టులు శనివారం అవగాహన ర్యాలీ చేశారు. వరల్డ్ బైస్కిల్ డే సందర్భంగా హైదరాబాద్ సైక్లిస్టు గ్రూప్, లీడ్ లైఫ్ ఫౌండేషన్, ఉమెన్ సేఫ్టీ వింగ్, తరుణీ సంస్థ ఆధ్వర్యంలో ఉదయం 6 గంటలకు సైక్లింగ్పై అవగాహన ర్యాలీని ముఖ్య అతిథులుగా పాల్గొన్న తెలంగాణ డీజీపీ అంజనీకుమార్, మహిళా భద్రతా విభాగం అడిషనల్ డీజీపీ శిఖా గోయెల్ జెండా ఊపి ప్రారంభించారు.
అనంతరం ఆ రైడ్లో వాళ్లు సైక్లింగ్ చేసి బైస్కిల్ ప్రాధాన్యతపై అవగాహన కల్పించారు. వీ లవ్ సైక్లింగ్ అంటూ డీజీపీ, ఏడీజీపీలు నినదించారు. వారితో గొంతు కలిపి సైక్లిస్టులంతా వీ లవ్ సైక్లింగ్ అంటూ అభిమానాన్ని చాటుకున్నారు. అనంతరం డీజీపీ మాట్లాడుతూ.. సైక్లింగ్కు తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక ట్రాక్స్ ఏర్పాటు చేస్తుందన్నారు. కాగా, సంగారెడ్డి, వరంగల్కు చెందిన ప్రభుత్వ పాఠశాల విద్యార్థినులకు ఉచితంగా సైకిళ్లను పంపిణీ చేశారు.