బంజారాహిల్స్/ సిటీబ్యూరో, నవంబర్ 6(నమస్తే తెలంగాణ): చిన్నారుల్లో వచ్చే క్యాన్సర్లపై అవగాహన నిమిత్తం అపోలో దవాఖాన ఆధ్వర్యంలో డ్యుయథ్లాన్ కార్యక్రమాన్ని శనివారం కేబీఆర్ పార్కు ప్రధాన గేట్టు వద్ద శనివారం చేపట్టారు. క్యాన్సర్ వచ్చిన బాలల చికిత్సకు అవసరమైన నిధులను సమీకరించడానికి అపోలో హైదరాబాద్ చాప్టర్ డీ2డీ డ్యుయథ్లాన్ 2021ను నిర్వహిస్తున్నది. ఇందులో భాగంగా ‘డాన్ టు డస్క్’ (సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం) వరకు పీడియాట్రిక్ క్యాన్సర్లపై ప్రజల్లో అవగాహన పెంచడంతో పాటు తక్కువ క్యాన్సర్ రిస్క్తో కూడిన భవిష్యత్తు కోసమని నిర్వాహకులు పేర్కొన్నారు.
అపోలో దవాఖానల ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్పర్సన్ శోభన కామినేని మాట్లాడుతూ పీడియాట్రిక్ క్యాన్సర్తో బాధపడుతున్న పేద పిల్లలకు చికిత్సను అందించేందుకు తోడ్పాటునందించాలని సూచించారు. డ్యుయథ్లాన్ను పెద్ద ఎత్తున నిర్వహించేందుకు నిర్ణయించామని, కార్యక్రమంలో పాల్గొనే వారు ఈనెల 13న వరకు తమ పేర్లను www.apollod2d.com వెబ్సైట్లో నమోదు చేసుకోవాలని కోరారు. తమంతట తాము నిర్ధారించుకున్న సమయానికి రేసులో పాల్గొనవచ్చన్నారు. 3 నుంచి 125 కిలోమీటర్ల వరకు పరుగు, నడక లేదా సైక్లింగ్ ద్వారా పూర్తి చేయవచ్చన్నారు.వివరాలకు ఫోన్ నంబర్లు 9959154371, 9963980259లో సంప్రదించాలని కోరారు.