తెలుగు యూనివర్సిటీ, ఫిబ్రవరి 26 : సమాజంలోని రుగ్మతలను రూపుమాపే రచనలు సాగాలని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు. తెలుగు భాషా సాహిత్యాలకు దశాబ్దాలుగా కొలకలూరి కుటుంబం ఎనలేని సేవలందిస్తున్నదని వక్తలు ప్రశంసించారు. నాంపల్లిలోని పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ఆడిటోరియంలో కొలకలూరి పురస్కారాల ప్రదానోత్సవ కార్యక్రమం సోమవారం సాయంత్రం ఘనంగా జరిగింది. శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం పూర్వ వీసీ, పద్మశ్రీ ఆచార్య కొలకలూరి ఇనాక్ కుటుంబ సభ్యులు గత 17సంవత్సరాలుగా సాహితీశ్రేష్టులకు ప్రదానం చేస్తున్న కొలకలూరి పురస్కారాలను 2024సంవత్సరానికి గాను పలువురికి ప్రదానం చేసి సత్కరించారు. ఆచార్య కొలకలూరి మధుజ్యోతి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. రచనలతో సమాజాన్ని ప్రభావితం చేసిన వారిని సత్కరించుకోవడం సంప్రదాయం అన్నారు. తెలుగువర్సిటీ వీసీ ఆచార్య టి.కిషన్రావు, ఆచార్య సీహెచ్ శ్రీనివాసరావు పాల్గొని ఆచార్య కొలకలూరి ఇనాక్ జీవితం, సాహిత్యంపై ప్రసంగించి ప్రశంసించారు.
కొలకలూరి భాగీరథీ కథానిక పురస్కారానికి గాను హుమయూన్ సంఘీర్ రచించిన కామునికంత, కేవీ మేఘనాథరెడ్డి రచించిన కలుంకూరి గుట్ట, కొలకలూరి విశ్రాంతమ్మ నవలా పురస్కారానికి డాక్టర్ దిలావర్ రచించిన అడవి బతుకులు, సింహప్రసాద్ రచించిన నిర్మాల్యం, కొలకలూరి రామయ్య విమర్శన పురస్కారానికి డాక్టర్ సుంకిరెడ్డి నారాయణరెడ్డి రచించిన తాత్తిక నేపథ్యంలో తెలుగు కవిత్వ పరిణామమం, వి.రాజా రామ్మోహనరావు రచించిన నవలా హృదయంకు పురస్కారాలను అందజేశారు. ప్రతీ విభాగంలోనూ ప్రథమ పురస్కార గ్రహీతకు 15వేల నగదు, ద్వితీయ పురస్కార గ్రహీతకు 5వేల నగదును బహూకరించారు. ఆచార్య కొలకలూరి ఇనాక్ సాహిత్యం-సామాజిక విశ్లేషణపై పరిశోధనలు చేసిన డాక్టర్ గడ్డం తిరుపతమ్మ, ఆచార్య కొలకలూరి నవలా సాహిత్యం-మానవతా థృక్పధం అనే అంశంపై పీహెచ్డీ చేసిన డాక్టర్ దుగులూరి సురేఖను సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఆచార్యులు కె.ఆశాజ్యోతి, జనార్దనం, కె.అనిత, శ్రీధర్, పాల్గొన్నారు.