సిటీబ్యూరో, మే 10(నమస్తే తెలంగాణ) : సమాజంపై మానసిక రుగ్మతలు తీవ్ర ప్రభావం చూపుతాయని, మానవాళికి ఇవే ఇప్పుడు అత్యంత ప్రమాదకర వ్యాధులుగా మారుతున్నాయని ఆస్ట్రేలియా హై కమిషనర్ బ్యారీ ఓ ఫారెల్, చెన్నయ్ కాన్సులేట్ జనరల్ సారా కిర్ల్యూ అన్నారు. ఏపీ, తెలంగాణ వ్యాప్తంగా ఆరోగ్య సంరక్షణ, వ్యాధుల నియంత్రణపై అధ్యయనం చేస్తున్న జార్జ్ ఇనిస్టిట్యూట్ ఫర్ గ్లోబల్ హెల్త్ ఇండియాతో కలిసి మానసిక రోగాలపై పరిశోధనలు చేయనున్నాయి. సోమాజిగూడలోని జార్జ్ ఇనిస్టిట్యూట్ ఫర్ గ్లోబల్ హెల్త్ ఇండియా కేంద్ర కార్యాలయంలో జరిగిన సమావేశంలో… ఇరు సంస్థలు ఒప్పందం చేసుకున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెట్టిన డిస్ట్రిక్ట్ మెంటల్ హెల్త్ ప్రోగ్రాం (డీఎంహెచ్పీ)ను బలోపేతం చేయనున్నట్లు పేర్కొన్నారు. హైదరాబాద్ కేంద్రంగా చేసుకుని మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించేందుకు అందుబాటులో ఉన్న శాస్త్రీయ విధానాలను అమలు చేసేందుకు ఈ ఒప్పందం కీలకంగా మారనుందని జార్జ్ గ్లోబల్ హెల్త్ ప్రతినిధులు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో జార్జ్ ఇనిస్టిట్యూట్ ఫైనాన్స్ అండ్ ఆపరేషన్స్ డైరెక్టర్ అమిత్ ఖన్నా, ప్రోగ్రాం డైరెక్టర్ డా.ప్రవీణ్ దేవరశెట్టి, పలువురు పాల్గొన్నారు.
తెలంగాణలో పైలట్ ప్రాజెక్టు
మానసిక ఆరోగ్య సమస్యలను నియంత్రించడమే లక్ష్యంగా ప్రత్యేక కార్యక్రమాన్ని ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్నది. జిల్లా స్థాయిలో వైద్యాధికారులు, గ్రామ స్థాయిలో ఆశ వర్కర్లు, పీహెచ్సీలో ఉండే వైద్యులపై ఈ అంశంపై అవగాహన కల్పిస్తుండగా, ఈ కార్యక్రమం అంకుర దశలో ఉంది. తెలంగాణతోపాటు, ఏపీలో వైద్య రంగంలో సేవలను విస్తరిస్తున్న జార్జ్ గ్లోబల్ హెల్త్ ఇనిస్టిట్యూట్ ఈ రంగంలోనూ తెలంగాణతో కలిసి పనిచేయనుంది. అన్ని వయస్సుల వారిలో సహజంగా పెరుగుతున్న ఒత్తిడి, డిప్రెషన్, ఆత్మన్యూనత, సూసైడల్ టెండెన్సీ వంటి లక్షణాలకు ఇచ్చే కౌన్సిలింగ్లో జార్జ్ గ్లోబల్ హెల్త్ సంస్థ క్షేత్రస్థాయి వైద్య సిబ్బంది అవగాహన కల్పించేలా ప్రణాళికలు రూపొందించనుంది.