సిటీబ్యూరో, మార్చి 22 (నమస్తే తెలంగాణ) : నగరంలోని నీటి వనరులు ఆక్రమణలకు గురికాకుండా పరిరక్షించడానికి కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని జీహెచ్ఎంసీ కమిషనర్ రొనాల్డ్ రాస్ సంబంధిత అధికారులను ఆదేశించారు. శుక్రవారం బుద్ద భవన్లోని ఈవీడీఎం కార్యాలయం సమావేశ మందిరంలో సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ జీహెచ్ఎంసీ పరిధిలోని అన్ని చెరువుల వద్ద ఎఫ్టీఎల్, బఫర్ జోన్ సరిహద్దులకు సంబంధించిన మ్యాప్లను చెరువుల వద్ద ప్రదర్శించాలని సూచించారు. లేక్ ప్రొటెక్షన్ కమిటీలను ఏర్పాటు చేయాలని, ఈ కమిటీ సభ్యులచే వాట్సాప్ గ్రూపులను చైతన్య పర్చాలని, మొబైల్ యాప్ ఇవ్వాలని, ఇందులో పర్యవేక్షణ నివేదిక పెట్టాలన్నారు. ఫెన్సింగ్, వాకింగ్ ట్రాక్, సీవరేజీ మళ్లింపు, సీసీ కెమెరాలు, వీధి దీపాలు, సెక్యూరిటీ గార్డుల ఏర్పాటుకు అంచనా ప్రతిపాదనలు 15 రోజులలో ఇవ్వాలని లేక్స్ అధికారులను ఆదేశించారు. నిర్మాణ వ్యర్థాలను చెరువులలో డంప్ చేస్తున్న వారిని గుర్తించి ఈవీడీఎం డైరెక్టర్కు సమాచారం ఇవ్వాలని, ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని లేక్స్ అధికారులను ఆదేశించారు. చెరువు బఫర్ జోన్లో నిర్మించే భవనాలకు ఉన్న పక్షంలో నోటీసులు జారీ చేయాలన్నారు. సమావేవంలో ఈవీడీఎం డైరెక్టర్ ప్రకాశ్ రెడ్డి, అడిషనల్ కమిషనర్లు శివకుమార్ నాయుడు, సునంద, జోనల్ కమిషనర్లు హేమంత్, స్నేహ శబరీష్, అభిలాష అభినవ్, రవి కిరణ్, వెంకన్న, ముకుందా రెడ్డి, ప్రాజెక్టు, లేక్స్ సీఈ దేవానంద్, ఎస్ఈ ఆనంద్, ఈఈ, తదితరులు పాల్గొన్నారు.