బన్సీలాల్పేట్, మే 14 : తెలుగుభాషలో ఉన్న అవధాన ప్రక్రియ ప్రపంచంలో ఎక్కడా లేదని, ఇది అద్భుతమైన విజ్ఞానంతో కూడిన మన ఆస్తి అని పంచ సహస్రావధాని, తిరుమల తిరుపతి అన్నమాచార్య ప్రాజెక్ట్ మాజీ సంచాలకుడు డాక్టర్ మేడసాని మోహన్ అన్నారు. అవధాన విద్యా వికాస పరిషత్, భాగ్యనగర్, తెలంగాణ ఆధ్వర్యంలో రెండో అవధాన శిక్షణ శిబిరం-2023 విజయోత్సవ సభ ఆదివారం పద్మారావునగర్లోని శివానంద ఆశ్రమంలో నిర్వహించారు. ఈ సభకు ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ… కొత్తవారికి అవధానంపై శిక్షణ శిబిరం నిర్వహించడం అభినందనీయమన్నారు. అనంతరం శిక్షణ పొందిన విద్యార్థులకు ప్రశంసాపత్రాలను అందజేశారు. భారత సాహిత్య పరిషత్ అధ్యక్షుడు ఆచార్య కసిరెడ్డి వెంకట్రెడ్డి సభాధ్యక్షత వహించిన ఈ కార్యక్రమంలో అవధాన విద్యా వికాస పరిషత్ వ్యవస్థాపక అధ్యక్షుడు దత్తాత్రేయ శర్మ, కార్యదర్శి డాక్టర్ కేవీఎన్ ఆచార్య, ముఖ్యమంత్రి కార్యాలయ ప్రజాసంబంధాల అధికారి వనమ జ్వాలా నర్సింహారావు, డాక్టర్ బులుసు అపర్ణ, ఆముదాల మురళి, డాక్టర్ రాంభట్ల పార్వతీశర్మ, తాతా సందీప్ శర్మ, డాక్టర్ బి.ఓంప్రకాశ్, గిరిప్రసాద్ శర్మ పాల్గొన్నారు.