కేపీహెచ్బీ కాలనీ, అక్టోబర్ 10 : వారిద్దరూ ప్రేమ వివాహం చేసుకున్నారు.. ఏడాది తిరుగకముందే మనస్పర్థలు రావడంతో విడిపోయేందుకు సిద్ధపడ్డారు. కానీ.. భార్యను వదులుకోవడానికి సిద్ధంగా లేక అతడు.. ఆమె ఇంట్లోకి చొరబడ్డాడు. అత్తామామలపై పెట్రోల్ పోసి.. నిప్పంటించి పారిపోయాడు. తీవ్రగాయాలతో వారు వైద్యశాలలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటన కేపీహెచ్బీ కాలనీ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. సీఐ లక్ష్మీనారాయణ కథనం ప్రకారం.. కేపీహెచ్బీ కాలనీ 6వ ఫేజ్లోని సాయిబృందావన్ అపార్టుమెంట్లో తీగల నితిక (29) సాఫ్ట్వేర్ ఇంజినీర్గా పనిచేస్తూ..తల్లిదండ్రులు రమాదేవి (50), సాగర్రావు (54)లతో కలిసి నివసిస్తున్నది. నితిక కరీంనగర్కు చెందిన సాయికృష్ణ (29)తో ప్రేమ వివాహం చేసుకున్నారు.
మనస్పర్థ్ధలు రావడం.. సాయికృష్ణ వేధించడంతో 2019లో కోర్టును ఆశ్రయించి..విడాకుల కోసం వేచి చూస్తున్నారు. శనివారం రాత్రి భర్త సాయికృష్ణ పెట్రోల్ బాటిల్ తీసుకుని నితిక ఇంటికి వెళ్లాడు. భయంతో ఆమె బెడ్రూమ్లోకి వెళ్లి తలుపు పెట్టుకోగా, నితిక తల్లిదండ్రులు అతడితో మాట్లాడే ప్రయత్నం చేశారు. వారిపై పెట్రోల్ను పోసి నిప్పంటించిన సాయికృష్ణ పారిపోయాడు. వెంటనే నితికతో పాటు స్థానికులు మంటలను ఆర్పి బాధితులను సమీపంలోని వైద్యశాలకు తరలించి చికిత్స చేయిస్తున్నారు. నితిక ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. సాయికృష్ణ పరారీలో ఉన్నట్లు చెప్పారు.